పల్లె వైద్యం..పేదలకు దూరం
కాణిపాకం : చంద్రబాబు సర్కారు రాకతో వైద్య ఆరో గ్య సేవలు కుంటుపడుతున్నాయి. పల్లె వైద్యం పక్కా దారి పడుతోంది. క్షేత్రస్థాయిలోని వైద్య వ్యవస్థను నీరుగారుస్తోంది. ఏఎన్ఎంల సొంత సేవలను వదిలించుకునేలా చేస్తోంది. అదనపు పనులు అంటగడుతోంది. మండల అధికారులతో మాటలు పడాల్సి వస్తోంది. ప్రశ్నిస్తే.. కడుపు కోతలు పెట్టిస్తోంది. తద్వా రా వైద్య ఆరోగ్య సేవలు, సర్వేలు నత్తనడకగా మారుతున్నాయి. దీంతో ఏఎన్ఎంలు ఆవేదనతో కుమిలిపోతున్నారు. ఈ గోడును ఆ సంఘం నేతలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి విన్నవించారు.
సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సిబ్బందికి ఇతర పనులు, సర్వేలకు పరిమితం చేసింది. తద్వారా సచివాలయ సేవలకు ప్రజలు దూరమయ్యారు. మండల స్థాయికి పరుగులు తీస్తున్నారు. ఇదే మాదిరిగానే విలేజ్ హెల్త్ క్లినిక్ సేవలు దూరం అవుతున్నాయి. ఈ కారణంగా పల్లైవెద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. కేంద్రాల్లో వైద్య సిబ్బంది కనుమరుగవుతున్నారు. ప్రస్తుతం సిబ్బందిని ఇతర సేవలకు వినియోగిస్తుండడంతో పేద ప్రజలకు సేవలు దూరం అవుతున్నాయి.
చేయకుంటే వేతనాలపై వేటు
జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు, 464 విలేజ్ హెల్త్ క్లినిక్లున్నాయి. వీటి కింద సచివాలయ ఏఎన్ఎంలు 464 మంది, అర్బన్లో ఏఎన్ఎంలు 103 మంది, సెంకడ్ ఏఎన్ఎంలు 84 మంది పనిచేస్తున్నారు. ప్రధానంగా సచివాలయ ఏఎన్ఎంలను వారి పరిధిలో జరిగే సర్వేలు చేయమని పలువురు ఎంపీడీఓలు ఒత్తిడి తెస్తున్నా రు. వాళ్లు చెప్పిన పనిచేయని పక్షంలో నోటీసులు ఇస్తున్నారు. లేకుంటే జీతాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దీనికితోడు డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్సబర్సింగ్ ఆఫీసర్) కూడా ఏఎన్ఎంలపై పెత్త నం చలాయిస్తున్నారు. వాళ్ల సర్వేలను కూడా చేయాలని, లేకుంటే ఎంపీడీఓకు రిపోర్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. సర్వేలకు తలొగ్గని పక్షంలో డీడీఓ లు జీతాల్లో జాప్యం చేయిస్తున్నారు. దీనికారణంగా వైద్య ఆరోగ్య సేవలు పల్లె జనానికి దూరమయ్యాయి.
ఎంఎల్హెచ్పీలపై ప్రభావం
ఏఎన్ఎంలను పట్టి పీడిస్తున్న అదనపు పనులు ఇప్పుడు..ఎంఎల్హెచ్పీలపై ప్రభావం చూపుతోంది. ఐరాల మండలంలోని ముగ్గురు ఎంఎల్హెచ్పీలను ఇతర పనులు చేయాలని ఇటీవల అక్కడి మండల, డీడీఓలు ఒత్తిడి తెచ్చారు. ఈవిషయాన్ని వెంటనే వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాల యం దృష్టికి తీసుకొచ్చారు. వారు అదనపు పను లు చేయొద్దని, వైద్య సేవలు మాత్రమే చూడాలని ఆదేశించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంలు వైద్య సేవ లు మాత్రమే చూసేవారు. విధిగా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వర్తించేవా రు. మంగళవారం ఆశా మీటింగ్, బుధవారం కేంద్రాల్లో వ్యాక్సినేషన్, శనివారం క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్, మీటింగ్లు, శిక్షణ కార్యక్రమాలు హాజరవుతూ..సొంత సర్వేలను చూసుకునేవారు. దీనికి తోడు విలేజ్ హెల్త్ క్లినిక్కు వచ్చే వారికి మందులు, మాత్రలు ఇచ్చుకుంటూ..వైద్య సేవలను ఎప్పటికప్పుడు పూర్తి చేసేవారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక పల్లె వైద్యం పేదలకు దూరం అయింది. ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్రాలు వదిలి అనధికారిక సేవలకు పరిమితమవుతున్నారు. పింఛన్ల పంపిణీ, ఓటరు పరిశీలన, ఆధార్ సీడింగ్, యోగా డే, నాన్ ఏపీ రెసిడెంట్, రేషన్కార్డు పంపిణీ, ఇంటింటా సర్వేలతో పాటు సచివాలయ పరి ధిలో జరిగే వాటన్నింటికి వారిని బాధ్యులు చేస్తున్నారు. కొందరు సచివాలయ సిబ్బంది తలకు మించిన సర్వేలు తాము చేయలేమని చేతులెత్తేయడంతో ఆ పనులను కూడా ఏఎన్ఎంలకు అంటగడుతున్నారు. బలవంతంగా సర్వేలు చేయిస్తున్నారు. చేయని పక్షంలో మండల అధికారులు నరకం చూపిస్తున్నారు.
విజృంభిస్తున్న విష జ్వరాలు
పల్లెల్లో వైద్య సేవలు దూరం కావడంతో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రస్తుతం పల్లె, పట్నం తేడా లేకుండా విషజ్వరాల ముప్పు ను తెచ్చిపెడుతున్నాయి. ఇందుకు తగ్గట్టు పల్లెల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండడం లేదు. సీజనల్ వ్యాధుల కట్టడి చేయలేకపోతున్నారు. స్థానిక ప్రజలు ప్రశ్నిస్తే...అదనపు పనులు ఉన్నాయని చెబుతున్నారు. ఇక స్క్రబ్ టైఫస్ కేసులు విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పల్లెల్లోని జనానికి మందు బిల్లులు ఇచ్చేవారు కూడా కరువుతున్నారు. కనీసం సలహాలు, సూచనలు ఇచ్చేవారు దూరమవుతున్నారు. ఎన్సీడీ–4, క్షయ, కుష్టు వ్యాధి తదితర సర్వేలన్నీ కూడా వెంటాడుతున్నాయి. ఈ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా మళ్లీ యథావిధిగా సాగుతోంది. వైద్య సిబ్బంది సొంత శాఖ పనులు తప్ప..ఏ ఇతర పనులు చేయకూడదని జీఓలు ఉన్న వాటిని పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ సమస్య పరిష్కారం కానీ పక్షంలో రోడెక్కడం కాయమని వైద్య సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు.
పల్లె వైద్యం..పేదలకు దూరం


