
గ్రామీణ వైద్యానికి ఆటంకం
నేటి నుంచి సమ్మెలోకి వెళ్లనున్న పీహెచ్సీ వైద్యులు ఓపీ సేవలు బంద్ అత్యవసర సేవలకు మినహాయింపు సర్వీస్ వైద్యుల పీజీ కోటా తగ్గింపుపై ఆగ్రహం ఏళ్ల తరబడి పని చేస్తున్నా సీనియర్ మెడికల్ ఆఫీసర్స్గానే మిగిలిపోతున్నామని ఆవేదన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పల్లె ప్రజలకు వైద్యసేవలు దూరం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మైసెరన్ మోగించారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతో పాటు ఓపీ సేవలకు స్వస్తి పలకనున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తూ..డిమాండ్ల సాధనకు పిడికిలి బిగించారు. ఈమేరకు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) నాయకులు నోటీసు సైతం అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. దీంతో పల్లె వైద్యానికి ఆటంకం ఏర్పడనుంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గ్రామీణ పని చేసే వైద్యుల విషయంలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా డాక్టర్లు సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తన్నట్లు ప్రకటించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ ఫీవర్స్ పట్టి పీడిస్తున్న తరుణంలో డాక్టర్లు సమ్మెలోకి వెళ్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయినా కూడా పీహెచ్సీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 95 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినిక్లు 30 శాతం, ఫిజియాలజీ, ఎనాటమీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ తదితర నాన్క్లినిక్లకు 50 శాతం సీట్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం గతేడాది క్లినిక్లు 15 శాతానికి, నాన్ క్లినికల్ 30 శాతానికి తగ్గించింది. అప్పట్లో వైద్యులు ఆందోళనకు దిగడంతో క్లినికల్ 20 శాతానికి పెంచారు. తాజాగా మళ్లీ 15 శాతానికి తగ్గించేసినట్టుగా ఏపీపీహెచ్సీడీఏ చెబుతోంది. సీహెచ్సీల్లో పనిచేస్తే మూడు, నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్స్గా ప్రమోషన్ ఇస్తుంటే 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నా పదోన్నతులు రాక సీనియర్ మెడికల్ ఆఫీసర్స్గానే మిగిలిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.
సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో, వరదలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతులు రావడం లేదని, జాయిన్ అయినప్పుడు ఉన్న కేడర్లోనే రిటైర్డు అవుతున్న పరిస్థితి ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ వైద్యుల డిమాండ్..
సర్వీస్లోని పీహెచ్సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లను పునరుద్ధరించాలి. టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలి. మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు అలవెన్స్ ఇవ్వాలి. కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువును ఐదేళ్లకు కుదించాలి.
సీజనల్కు సమ్మె ఎఫెక్ట్
జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రధానంగా ప్రతి పల్లెజనం విషజ్వరంతో అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం బారిన పడ్డారు. జేబులో డబ్బులు ఉంటే ఆర్ఎంపీ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత లేనివారంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే క్యూకడతారు. ఈ మధ్యకాలంలో జ్వరం కేసులు ఆరోగ్య కేంద్రాలను చుట్టిముడుతున్నాయి. ఇలాంటి తరుణంలో డాక్టర్ల సమ్మె పేద రోగులకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.