
భూకబ్జాలో రవితేజం!
పేదల ఇళ్ల స్థలాలతోపాటు అటవీశాఖ భూమి ఆక్రమణ జేసీబీతో చదును.. కొబ్బరి చెట్లు నాటిన వైనం! వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానికుల ఆందోళన జేసీబీని సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు
కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కన్ను ప్రభుత్వ, పేదల భూములపై పడుతోంది. అధికారం అడ్డుపెట్టుకుని ఏకంగా పేదల ఇళ్ల స్థలాలతోపాటు అటవీశాఖ భూమిని సైతం దర్జాగా కబ్జా చేశాడు. కార్పొరేట్ స్థాయిలో కొబ్బరి తోట సాగుకు పూనుకున్నాడు. దాదాపు కోటి రూపాయల విలువైన 8 ఎకరాలను ఆక్రమించాడు. ఈ యవ్వారంపై శుక్రవారం బాధితులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేయడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. భూమి ని చదును చేస్తున్న జేసీబీని సీజ్ చేశారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ పాలనలో బండపల్లె ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. సుమారుగా 500 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. నీటి వసతి, కరెంటు సౌకర్యం కల్పించింది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడం, ఇతర కారణాలతో కొంత మంది ఇళ్లు కట్టుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ కార్పొరేటర భర్త ఆ స్థలంపై కన్నేశారు. ఎలాగైనా దానిని సొంత చేసుకోవాలని కరెంటు స్తంభాలు, నంబర్ రాళ్లను, నీటి పైపులను ధ్వంసం చేశాడు. పేదల ఇళ్ల స్థలాలతో పాటు అటవీ భూములను సైతం ఆక్రమించేశాడు. ఆక్రమించిన సుమారు 8 ఎకరాల స్థలంలో దాదాపు 400 కొబ్బరి చెట్లు నాటాడు. ఇది ఆ నోటా ఈనోటా పడి చివరకు అధికారుల చెవిలో పడింది. గురువారం రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి కొబ్బరి చెట్లను తొలగించారు.
పేదల స్థలాన్ని కబ్జా చేస్తారా..?
రెవెన్యూ అధికారులు కబ్జాకు చెక్ పెట్టినా మళ్లీ ఆక్రమణ పర్వం కొనసాగడంతో వైఎస్సార్సీపీ నాయకులు, పేదలు శుక్రవారం ఆక్రమిత ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఆక్రమణ వ్యవహారాన్ని మీడియా ముందుకు పెట్టి, నాయకులు అంజలిరెడ్డి, హరీషారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు దోచుకోవడమే పనిగా పడ్డారన్నారు. టీడీపీ కార్పొరేటర్ జయలక్ష్మి భర్త పేదల ఇళ్ల స్థలాలతోపాటు అటవీశాఖ భూములను సైతం కబ్జాచేశారని, కరెంటు స్తంభాలు, పైపులైన్లను దౌర్జన్యంగానే తొలగించారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు జేసీబీని సీజ్ చేశారన్నారు. జయలక్ష్మి భర్త లెప్రసీ డాక్టర్గా పనిచేస్తూ రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ చెందారని, వారికి కోట్లాది రూపాయల ఆస్తులు సైతం ఉన్నాయన్నారు. అధికారులు తనకు 8 ఎకరాల స్థలం కేటాయించినట్లు ఆయన చెప్పుకుంటున్నారని, ఇదే నిజమైతే ఎవరికి ఎంతెంత వాటాలందాయో, దీని వెనుక బాగోతమేమిటో ఉన్నతాధికారులే తేల్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ బాధితులకు ఎమ్మెల్యే సైతం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లేనిపక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్, మురగయ్య, ప్రభాకర్రెడ్డి, వెంకటముని, సుధా, బాలాజి, సురేంద్ర, రమేష్, మోహన్, మురగ, సెల్వం, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. దీనిపై రూరల్ తహసీల్దార్ జయప్రకాష్ను వివరణ కోరగా.. ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు.
చదును చేసిన భూమి
ధ్వంసమైన తాగునీటి ట్యాంక్, పైపులు
విద్యుత్ స్తంభాలు

భూకబ్జాలో రవితేజం!

భూకబ్జాలో రవితేజం!

భూకబ్జాలో రవితేజం!