చరిత్రకు ఆనవాళ్లు చలపనకోన కొండ గుహలు
నాటి ఆదిమానవులు గీసిన చిత్రాలు.. మహర్షులు తపస్సు చేసిన గుర్తులు
మెగాలిథిక్ కళకు సారూప్యత అంటున్న పురావస్తు అధ్యయనకారులు
ఇక్కడి రాతి శాసనానికి 600 ఏళ్లు
గత ప్రభుత్వంలో సీసీ రోడ్డు నిర్మాణం
పర్యాటక కేంద్రంగా మార్చాలని నగరి మండల ప్రజల కాంక్ష
నగరి సమీపంలో ఉన్న చలపన కోన చరిత్రకు ఆనవాళ్లకు సాక్ష్యంగా నిలుస్తోంది. కోనలోని రాళ్లలో కొన్ని వేల ఏళ్ల చరిత్ర దాగుంది. ఆదిమానవుల జీవన శైలిని తెలిపే అనేక గుర్తులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రాచీన చరిత్రను తెలిపే ఆధారాలు ఇక్కడ అనేకం. ఆది మానవుడి కాలం నాటి శిలా చిత్రలేఖనాలు, ఎరుపు వర్ణంలో మానవ చిత్రాలు, చక్రాల గుర్తులు దర్శనమిస్తాయి. మహర్షులు తప్పస్సు చేసినట్లు ఆనవాళ్లు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ కోన ఖ్యాతిని పెంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని నగరి ప్రజలు కోరుతున్నారు.
కొండపైకి వెళ్తున్న పర్యాటకులు
చలపర కోన కొండ గుహ
నగరి : మండలంలోని ముడిపల్లి గ్రామం నుంచి 3 కి.మీ దూరంలో స్థానికంగా చలపరకోన కొండ ఉంది. ఇక్కడ వెలసిన చలపరమ్మ అనే దేవత కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. స్థానిక ప్రజలు అమ్మవారికి పూజలు చేస్తారు. సమీపంలో ఉన్న గుహ లోపల చలపరమ్మ దేవత ఉండేదని చెబుతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా గతంలో పురాతన శిలాయుగం పనిముట్లు గుర్తించబడ్డాయి. పరిసరాల్లో 3వ శతాబ్దం నాటి చారిత్రక అవశేషాలు కనుగొన్నారు.
రాతిశాసనానికి 600 ఏళ్లు
చారిత్రక విశేషాలకు నెలవుగా చెప్పుకునే చలపరకోన, నాగతీర్థం కొండలకు సమీపంగా కరియమాణిక్య స్వామి ఆలయ సమీపంలో ఒక రాతి శాసనం ఏర్పాటు చేయబడింది. అందులో ప్రాచీన తమిళలిపిలో చెక్కబడి ఉన్న సమాచారం పురావస్తుశాస్త్ర వేత్తలు అధ్యయనం చేసిన మేరకు ఈ శాసనం 1426 సెప్టెంబరు 8వ ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఈ శాసనం 600 ఏళ్లు పూర్తిచేసుకుంది.
మెగాలిథిక్ కళతో సారూప్యత
ప్రాచీన చరిత్ర, పురావస్తు శాస్త్ర పరిశోధకులు కొండగుహలోని చిత్రాల ఆధారంగా చేసిన పరిశోధనల్లో చల పరకోనలో చెక్కి ఉన్న చక్రాల బొమ్మలు మల్లయ్యపల్లి, సుండుపల్లి మెగాలిథిక్ సమాధుల్లో చిత్రించిన చక్రాలతో సారూప్యతలను కలిగి ఉన్నాయని, మానవ బొమ్మలు మల్లయ్యపల్లి మెగాలిథిక్ కళతో సారూప్యతలను కలిగి ఉన్నాయని వీటి ఆధారంగా చలపరకోన రాతికళ మెగాలిథిక్ కాలానికి చెందినదిగా ఉండవచ్చని పురావస్తు అధ్యయనకారులు చెబుతున్నారు. ఆపై ఇక్కడ నివశించిన మహర్షులు కొండగుహలో శివలింగం ప్రతిష్ట చేసి, రాతిపై తమిళంలో నాగదేవతకు ప్రతీకగా సర్పాలను 1894లో చెక్కినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఈ ప్రాంతానికి నాగతీర్థం అనే పేరు స్థిరపడింది. ఇక్కడి కొండలపై మహర్షులు (మునులు) తపస్సుచేసినట్లుగా రాతిగుహల్లో నిర్మించుకున్న కుటీరాలు ఉన్నాయి. అందుకే ఈ మునిపల్లి కాస్త ముడిపల్లిగా మారిందని చరిత్రకారులు చెబుతారు.
ఉట్టి పడే రాతి కళ
చలపరకోన గుహలో ఆది మానవులు గీసిన చిత్రాలు దర్శనమిస్తున్నాయి. రాతి కళలో మానవ, జంతు, మత, రేఖాగణితం, తదితర వంటివి గుర్తించబడని డ్రాయింగ్లకు చెందిన అనేక చిత్రాలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. చిత్రాలను గీయడానికి ఆది మానవుడు ఎరుపు, ఎరుపు గోధుమ, తెలుపు వర్ణద్రవ్యాలను ఉపయోగించాడు. ఈ రాతి గుహలోని రాతి కళ వివిధ పురావస్తు కాలాల ద్వారా కళాత్మక వ్యక్తీకరణల కొనసాగింపును చూపుతుంది. ప్రస్తుతం చలపరకోన రాతి గుహలో రాతిపై చెక్కిన చక్రాలు, త్రిశూలాలు, వృత్తాలు, ఒకరి చేతులు ఒకరు పట్టుకున్న మానవ వరుస, తల్లిదండ్రులు బిడ్డ చేయి పట్టుకుని నడుస్తున్న ఆకారాన్ని గుర్తించారు. ఆర్కియాలజికల్ అధ్యయనాలు వెల్లడించిన మేరకు ఆది మానవులు సహజంగా లభించే ఖనిజాలు, మూలికలు, జంతు పదార్థాలను వాటి పరిసర వాతావరణంలో కలపడం ద్వారా రంగులు వేశారు. పలు చిత్రాలు మసకబారి ఉన్నాయి.
చలపరకోన..చారిత్రక వీణ
చలపరకోన..చారిత్రక వీణ
చలపరకోన..చారిత్రక వీణ