
నేడు కృత్రిమ పరికరాల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ కళాశాల ప్రాంగణంలో గురువారం ఉదయం 11 గంటలకు 977 మంది విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ పరికరాల పంపిణీ చేయనున్నట్లు బుధవారం డీఆర్వో మోహన్కుమార్ విలేకరులకు తెలిపా రు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాందాస్ అథాలే, జిల్లా ఇంచార్జి మంత్రి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.
ఉద్యోగ మేళాలో 67 మంది ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ కళాశాలలో నిత్యం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాల చైర్మన్ శ్రీధర్ అన్నారు. బుధవారం నగరంలోని సీఎంటీ రోడ్డులోని ఆ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు పేరొందిన కంపెనీలు పాల్గొన్నాయన్నారు. మేళాలో 105 మంది పాల్గొనగా అందులో 67 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. పలు కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
5న సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈనెల 5వ తేదీన బదిలీల ఉత్తర్వులు పంపనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని భావించి 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. నేరుగా ఈ మెయిల్ ద్వారా బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు పంపనున్నారు. వివిధ ప్రాంతాలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ అయినప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్నారు. బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని అధికారులు సూచిస్తున్నారు.