
రెవెన్యూ సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తహసీల్దార్లు రెవెన్యూ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురు వారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై వర్క్షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.
ఆర్ఓఆర్ సమస్యలు అధికం
జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్ఓఆర్ సమస్యలు అధికంగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్ఓఆర్ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు ఆర్డీఓలు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తమకు కేటాయించిన మండలాల్లో భూ అలినేషన్, అసైన్మెంట్ భూమి, రెగ్యులరైజేషన్, ఆర్ఓఆర్, వెబ్ల్యాండ్, రీ సర్వే సమస్యలను గుర్తించాలన్నారు. వెబ్ల్యాండ్లో సవరణలు చేసే సమయంలో తహసీల్దార్లు రికార్డులను పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం చర్యలు చేపట్టాలన్నారు. రీ సర్వే పురోగతికి వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు తరచూ సమీక్షించాలన్నారు. ఈ వర్క్షాప్లో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు పాల్గొన్నారు.