నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు! | Zoho Layoffs Spark Outrage 300 Trainees Axed Without Notice | Sakshi
Sakshi News home page

నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!

Apr 14 2026 3:57 PM | Updated on Apr 14 2026 4:08 PM

Zoho Layoffs Spark Outrage 300 Trainees Axed Without Notice

ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?

బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్రెషర్ల ఆవేదన

‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్‌తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.

వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!

జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

టెక్ వర్గాల్లో తీవ్ర నిరసన

ఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్‌మన్ సాక్స్, హెచ్‌పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్‌ఫైర్‌లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.

కంపెనీ స్పందన కోసం నిరీక్షణ

ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Advertisement
 
Advertisement
Advertisement