పెట్టుబడులకు బూస్ట్‌.. వడ్డీరేట్ల కట్‌! | West Asia crisis has evolved into systemic tremor | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు బూస్ట్‌.. వడ్డీరేట్ల కట్‌!

Apr 7 2026 5:31 AM | Updated on Apr 7 2026 7:08 AM

West Asia crisis has evolved into systemic tremor

రెండింటికీ మనకు వెసులుబాటు ఉంది 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్‌కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. 

కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్‌లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. 

ముందుంది గడ్డుకాలం... 
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్‌ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్‌ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement