తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న తన తయారీ కేంద్రం నుంచి 10,000వ వాహనాన్ని విడుదల చేయడం ద్వారా విన్ఫాస్ట్ భారతదేశంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. వియత్నామీస్ ఈవీ తయారీ సంస్థ భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించిన ఏడాది లోపే ఈ ఘనతను సాధించడం, దాని స్థానిక కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని సూచిస్తుంది.
విన్ఫాస్ట్ ఇండియన్ ప్లాంట్ ప్రస్తుతం VF 6, VF 7 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. ఈ రెండు వాహనాలు ఇంకా భారతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో కనిపించనప్పటికీ.. స్థానిక తయారీ, సరఫరాదారుల భాగస్వామ్యాలు, డీలర్ నెట్వర్క్ విస్తరణతో క్రమంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది.
తూత్తుకుడిలోని విన్ఫాస్ట్ ప్లాంట్, వియత్నాం వెలుపల కంపెనీకి చెందిన మొట్టమొదటి తయారీ కేంద్రం. ప్రస్తుతం దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లు. డిమాండ్ పెరిగే కొద్దీ ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో స్థానికీకరణను పెంచడానికి, ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లకు భారతదేశాన్ని ఎగుమతి కేంద్రంగా ఉపయోగించుకోవడానికి కూడా కంపెనీ సన్నద్ధమవుతోంది.
అయితే.. కార్లను ఉత్పత్తి చేయడం ఒక పని. కానీ ఇప్పటికే స్థిరపడిన దిగ్గజ సంస్థల కంటే, అంతగా ప్రాచుర్యం లేని బ్రాండ్ను ఎంచుకునేలా భారతీయ కొనుగోలుదారులను ఒప్పించడమే అసలైన సవాలు. అమ్మకాలు, సర్వీస్ సపోర్ట్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక యాజమాన్య అనుభవం వంటివి కంపెనీ ఎదుగుదలను నిర్ణయిస్తాయి. ప్రస్తుతానికి కంపెనీ 10,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక బలమైన ప్రారంభం అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!


