వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శాంతి మంతనాలు - పట్టువిడుపులు
మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశం
మార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.
ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమం
సంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
హార్మూజ్ జలసంధిపై పట్టు
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.
సైనిక ఉపసంహరణ - పరిహారం
గత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్!


