మార్కెట్‌లో ట్రంప్‌ కల్లోలం  | Stocks fall as Donald Trump declares US-Iran ceasefire over | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో ట్రంప్‌ కల్లోలం 

Jul 9 2026 12:20 AM | Updated on Jul 9 2026 12:27 AM

Stocks fall as Donald Trump declares US-Iran ceasefire over

ఇరాన్‌తో ‘సీజ్‌ ఫైర్‌ ఓవర్‌’ అంటూ ప్రకటన 

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు  

6% పైగా ఎగిసిన చమురు ధరలు 

సెన్సెక్స్‌ 1,667 పాయింట్లు క్రాష్‌; 23,900 దిగువకు నిఫ్టీ 

3 నెలల్లో సూచీల అతిపెద్ద పతనం  

ఒక్క రోజే రూ.8.96 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

ముంబై: ‘‘ఇరాన్‌తో అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి చర్చలు ఉండవు. కేవలం సంప్రదింపులు మాత్రమే ఉంటాయి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 

హార్మూజ్‌ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనతో అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధర 6.18 శాతం ఎగిసి బ్యారెల్‌కు 78.74 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గడిచిన మూడు నెలల్లోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 1,667 పాయింట్లు క్షీణించి 76,504 వద్ద ముగిసింది. నిఫ్టీ 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద స్థిరపడింది.

ఒక్కరోజే ఇన్వెస్టర్ల మార్కెట్‌ సంపద రూ.8.96 లక్షల కోట్లు కరిగిపోయింది. దీంతో  బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.471 లక్షల కోట్లకు దిగివచ్చింది. 

రోజంతా అమ్మకాల ఒత్తిడే... 
బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య సూచీలు నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. చివరి గంటలో విక్రయాలు మరింత ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 1,922 పాయింట్లు క్షీణించి 76,259 వద్ద, నిఫ్టీ 594 పాయింట్లు కోల్పోయి 23,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 

అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల ఇండెక్సులన్నీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సర్వీసెస్‌ సూచీ 3.21 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2.76%, ప్రైవేటు బ్యాంకులు 2.74%, ఎఫ్‌ఎంసీజీ 2.54 %, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 2.49 శాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ 2.14 %, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ 1.61 శాతం క్షీణించాయి. 

సెన్సెక్స్‌ సూచీలో అన్ని షేర్లూ డీలా  
సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఇండిగో (–5.22%), మారుతీ (–4.11%), హెచ్‌యూఎల్‌ (–3.36%), బజాజ్‌ ఫైనాన్స్‌ (–3.07%), కోటక్‌ మహీంద్రా (– 2.93%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. మరోవైపు, అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ (– 2.27%), ఐసీఐసీఐ బ్యాంక్‌ (–2.36%), రిలయన్స్‌ (–2.35%), ఎల్‌అండ్‌టీ(–2.41%), ఎయిర్‌టెల్‌  (–1.82%) షేర్లు నష్టపోయాయి.  

ఆయిల్, ఏవియేషన్, పెయింట్స్‌ షేర్లు బేర్‌..  
క్రూడ్‌ సెగతో మార్కెటింగ్‌ మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందన్న అంచనాలతో హెచ్‌పీసీఎల్‌ (–4.60%), ఐఓసీ (–3.51%), బీపీసీఎల్‌ (–3.20%) షేర్లు బలహీనపడ్డాయి. ఏటీఎఫ్‌ ధరల ఆందోళనతో ఇండిగో (–5.02%), స్పైస్‌జెట్‌ (–3.04%) పడ్డాయి.  షాలీమార్‌ పెయింట్స్‌ 4.44 శాతం, ఇండిగో పెయింట్స్‌ 4.18 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 2.49 శాతం, బర్జర్‌ పెయింట్స్‌ 2.26 శాతం క్షీణించాయి.

బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు  
భౌగోళిక, రాజకీయ ఉద్రికత్తల దెబ్బతో  ప్రపంచ మార్కెట్లన్నీ ఎరుపెక్కాయి. కొరియా (–5.65%), జపాన్‌ (–2.15%), చైనా (–0.49%) నష్టపోయాయి. జర్మనీ (–1.96%), ఫ్రాన్స్‌ (–2.11%) పతనమయ్యాయి. బ్రిటన్‌ (–1.44%), అమెరికా స్టాక్‌ సూచీలు ఒకటిన్నర శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

న్యాక్‌ ప్యాకేజింగ్‌ లిస్టింగ్‌ సక్సెస్‌ 
న్యాక్‌ ప్యాకేజింగ్‌ లిస్టింగ్‌ విజయవతమైంది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.170)తో పోలిస్తే 9.41% ప్రీమియంతో రూ.186 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది.  13% లాభపడి రూ.192 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 7.47 శాతం లాభంతో రూ.183 వద్ద ముగిసింది.

ఉదయం 9.15
సెన్సెక్స్‌ 77,816 (–365)
మధ్యాహ్నం 1.45
సెన్సెక్స్‌ 77,559 (–622)
మధ్యాహ్నం 3.30
సెన్సెక్స్‌ 76,504 (–1,677) 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement