స్కోడా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వస్తోంది.. | Skoda announces all new compact SUV for the Indian market | Sakshi
Sakshi News home page

స్కోడా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వస్తోంది..

Mar 1 2024 7:34 AM | Updated on Mar 1 2024 11:05 AM

Skoda announces all new compact SUV for the Indian market - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా సరికొత్త కాంపాక్ట్‌ ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. 2025 తొలి అర్ద భాగంలో ఈ కారు రోడ్లపై పరుగు తీయనుందని వెల్లడించింది. కంపెనీ నుంచి భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకించి తయారైన మూడవ మోడల్‌గా ఇది నిలవనుంది. కుషాక్, స్లావియా మాదిరిగా ఎంక్యూబీ–ఏ0–ఇన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకోనుంది.

పొడవు నాలుగు మీటర్ల లోపు ఉంటుంది. సంస్థకు ఇది ఎంట్రీ లెవెల్‌ మోడల్‌గా ఉండనుంది. 2022, 2023లో మొత్తం 1,00,000 పైచిలుకు కార్లను స్కోడా ఆటో ఇండియా విక్రయించింది. అన్ని మోడళ్లతో కలిపి 2026 నాటికి ఏటా 1,00,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రతి పాదిత కొత్త మోడల్‌కు పేరును సూచించేందుకు కంటెస్ట్‌లో పాల్గొనవచ్చని కంపెనీ ప్రకటించింది.  

ఈ ఏడాదే భారత్‌కు స్కోడా ఎన్యాక్‌ ఈవీ  
ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ అయిన స్కోడా ఎన్యాక్‌ ఈ ఏడాదే భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్‌ పనితీరుపై దేశీయంగా టెస్టింగ్‌ జరుగుతోంది. ‘ఈ–మొబిలిటీ విషయంలో కంపెనీకి లోతైన అనుభవం ఉంది.  వచ్చే మూడేళ్లలో ఆరు మోడళ్లకు విస్తరిస్తాం. ఇందులో ఒక మోడల్‌ ప్రత్యేకంగా భారత్‌కు తీసుకువస్తాం’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ పీటర్‌ జనీబా తెలిపారు. 2027 నుంచి దేశీయంగా ఈవీలను అసెంబుల్‌ చేస్తామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement