
మిశ్రమంగా ముగిసిన సూచీలు
ముంబై: ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల నాలుగు రోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–0.69%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–0.64%), ఐసీఐసీఐ బ్యాంకు(–0.85%) షేర్ల పతనంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 82,392 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ ఒక పాయింటు స్వల్ప లాభంతో 25,104 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 236 పాయింట్లు బలపడి 82,681 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు ఎగసి 25,199 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. విదేశీ పెట్టుబడుల పునరాగమనంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.57 స్థాయి వద్ద ముగిసింది. మెరికా చైనాల మధ్య లండన్లో జరుగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
⇒ బీఎస్ఈలో రంగాల వారీగా రియల్టీ 1%, టెలికం 0.55%, ఫైనాన్సియల్ 0.46%, సర్విసెస్ 0.21%, కన్జూమర్ డిస్క్రిషనరీ 0.16 శాతం నష్టపోయాయి. నష్టాల మార్కెట్లోనూ ఐటీ, వినిమయ, విద్యుత్, టెక్, హెల్త్కేర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.