
రిటైర్మెంట్ తర్వాత వేతనం మాదిరే ఆదాయం
అదనపు ఆదాయానికి మెరుగైన మార్గం
ఈక్విటీ, డెట్ కలయికతో పెట్టుబడులు
వీటి నుంచి కోరుకున్నంత వచ్చేలా ఎస్డబ్ల్యూపీ
సంపాదనకు గుడ్బై చెప్పిన తర్వాత విశ్రాంత జీవనం సాఫీగా సాగిపోవాలంటే స్థిరమైన ఆదాయ వనరు తప్పనిసరి. అప్పటి వరకు చేసిన పెట్టుబడులు, రిటైరయ్యాక స్థిరమైన ఆదాయానికి దారి చూపాలి. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయ ప్రణాళిక విషయంలోనే గందరగోళానికి గురవుతుంటారు. ఈక్విటీల్లో లేదా డెట్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నది అంత సులభంగా తేల్చుకోలేరు.
అప్పటి వరకు పొదుపుతో సమకూర్చుకున్న విలువైన వనరులను వివేకంగా వినియోగించుకోవడం ఎలానో తెలియని వారే ఎక్కువ. రిటైర్మెంట్ తర్వాత ఒకట్రెండు దశాబ్దాల పాటు జీవిత అవసరాలను గట్టెక్కడం అంత సులువేమీ కాదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరుగును’ అన్నట్టు.. కష్టార్జితంతో కూడబెట్టుకున్న నిధిని మిగిలిన జీవిత కాలం పాటు పొదుపుగా వాడేందుకు సమర్థవంతమైన ప్రణాళిక తప్పకుండా ఉండాలి.
రిటైర్మెంట్ తర్వాత చాలా మంది చేసే తప్పు.. తమవద్దనున్న నిధులన్నింటినీ తీసుకెళ్లి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో, లేదా ఇతర డెట్ సాధనాల్లోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్థిరమైన రాబడి, భద్రత దృష్ట్యా ఇలా చేయడం గమనించొచ్చు. కానీ, వీటి నుంచి వచ్చే రాబడులు ద్రవ్యోల్బణాన్ని మించి ఏమంత గొప్పగా ఉండవు. దీర్ఘకాలంలో సగటు ద్రవ్యోల్బణం 6 శాతం అనుకుంటే, వీటిల్లో రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుంది.
కనుక ఇలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవడం వల్ల.. అక్కడి నుంచి పదేళ్ల కాలంలో కరెన్సీ విలువ తగ్గిన మేర వారి పెట్టుబడి వృద్ధి చెందదు. అందుకే పెట్టుబడుల్లో ఈక్విటీలకూ చోటివ్వడం ఎంతో అవసరం. ఈక్విటీ ఫండ్స్లో నిరీ్ణత కాలానికోసారి పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఎలా అయితే ఉపకరిస్తుందో.. ఈక్విటీ పెట్టుబడుల నుంచి క్రమానుగతంగా కొద్ది మొత్తం చొప్పున ఉపసంహరించుకునేందుకు సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అనుకూలిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఈ మార్గంలో అందుకోవచ్చు.
స్థిరమైన ఆదాయం
పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుందన్నది నిపుణుల విశ్లేషణ. రిటైర్మెంట్ తర్వాత కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు.
ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కనుక పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి.
పెట్టుబడి కరగకూడదు..
పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం.. కచి్చతంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది.
ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. కనుక ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటు లో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
పన్ను ప్రయోజనాలు
బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. అదే ఈక్విటీ ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. డెట్ సాధనాలపై రాబడి వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి, ఏ శ్లాబు పరిధిలో వస్తే ఆ మేరకు పన్ను రేటు చెల్లించాలి. అదే ఈక్విటీ రాబడులపై పన్ను విడిగా ఉంటుంది. రూ.1.25 లక్షలు మించిన దీర్ఘకాల రాబడిపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే చాలు. కేవలం మొదటి ఏడాది ఉపసంహరణ మొత్తంలో రాబడిపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత నుంచి రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పరిధిలోకే వస్తుంది.
నగదు ప్రవాహాలపై సౌలభ్యత
ఎస్డబ్ల్యూపీతో నెలవారీ ఎంత అవసరమో అంతే వెనక్కి తీసుకోవచ్చు. తమ అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు. నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్ సంక్షోభాలను ఎదుర్కొంటుంటే..వాటి నుంచి ఉపసంహరణను గణనీయంగా తగ్గించుకోవడం లేదంటే తాత్కాలికంగా నిలిపివేసి.. డెట్ పెట్టుబడుల నుంచి ఉపసంహరణతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీలోనూ రకాలున్నాయి. కోరుకున్నంత స్థిరంగా ఉపసంహరించుకోవడం ఇందులో ఒకటి. క్యాపిటల్ అప్రీసియేషన్ ఎస్డబ్ల్యూపీలో అయితే.. పెట్టుబడుల వృద్ధి వరకు (రాబడి) వెనక్కి తీసుకోవచ్చు. అసలు పెట్టుబడి అలాగే కొనసాగుతుంది.
అస్థిరతల్లో పరిష్కారం..
రాబడి ఒక్కటే కాదు పెట్టుబడిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈక్విటీలు దిద్దుబాటుకు గురైనప్పుడు అందులోని పెట్టుబడుల విలువ క్షీణిస్తుంటుంది. కనుక ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడుల నుంచి ఉపసంహరణ ఎప్పటి మాదిరిగా కొనసాగించకపోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఈక్విటీల్లో దిద్దుబాటు ముగిసే వరకు గట్టెక్కేందుకు డెట్ పెట్టుబడులను వినియోగించుకోవాలి. దీనివల్ల తిరిగి ఈక్విటీలు ర్యాలీ చేసిన సమయంలో పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందేందుకు వీలుంటుంది.
డెట్ పెట్టుబడులూ అవసరమే
విశ్రాంత జీవనంలో అవసరాలకు పూర్తిగా ఈక్విటీలపై ఆధారపడడం రిస్క్ నిర్వహణ పరంగా మెరుగైన నిర్ణయం కాబోదు. ఈక్విటీ, డెట్ కలబోతగా ఉండాలి. ఎస్డబ్ల్యూపీ కోసం ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ సాధనాలను ఎంపిక చేసుకున్నప్పటికీ అదే సమయంలో విడిగా డెట్ సాధనాలనూ పోర్ట్ఫోలియోలో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఈక్విటీ పతనాల్లో ఎస్డబ్ల్యూపీని తాత్కాలికంగా నిలిపివేయాల్సి రావచ్చు. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో బేరిష్ దశలోకి వెళ్లినప్పుడు డెట్ పెట్టుబడులు ఆదుకుంటాయి. రిస్క్ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది. ఇన్వెస్టర్ల వద్దనున్న మొత్తం పెట్టుబడి, ఆదాయ అవసరాలు, రాబడి అంచనాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ కేటాయింపులు ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి.
ఎవరికి అనుకూలం..?
ఎస్డబ్ల్యూపీ రిటైర్మెంట్ తీసుకున్న వారికోసమే అనుకోవద్దు. పెట్టుబడిపై స్థిరమైన నగదు ప్రవాహాలు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ ప్లాన్ మెరుగైనదన్నది నిపుణుల సూచన. రిటైర్మెంట్ తీసుకున్న వారు, రిటైర్మెంట్ సమీపంలో ఉన్న వారు, అదనపు ఆదాయం కోరుకునే వారికి ఇది అనుకూలమని బంధన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సేల్స్ హెడ్ గౌరబ్ పరిజ తెలిపారు. ‘‘ఇప్పట్లో పదవీ విరమణ తీసుకోని వ్యక్తులు సైతం, జీవన అవసరాలకు వీలుగా అదనపు ఆదాయం కోసం ఎంపిక చేసుకోవచ్చు. జీవితంలోని వివిధ దశల్లో అదనపు ఆదాయం కోసం ఇదొక పరిష్కారం. కాకపోతే రిటైర్మెంట్ తీసుకున్న వారు ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు’’ అని వివరించారు.
పొరపాట్లకు చోటివ్వొద్దు..
→ ఎస్డబ్ల్యూపీ అన్నది చాలా శక్తివంతమైన సాధనం. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం లేదా నిపుణుల సూచన లేకుండా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు
ఎదుర్కోవాల్సి రావచ్చు.
→ అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోవద్దు. అతి రాబడుల అంచనాలు విశ్రాంత జీవనంలో బెడిసి కొడతాయి. ముఖ్యంగా మార్కెట్ ఆటుపోట్లలో మోస్తరు రాబడులకే పరిమితం కావాలి.
→ నిపుణుల సూచనకు మించి అధిక మొత్తాన్ని వెనక్కి తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడో ఓసారి తప్పిస్తే.. అవసరాలకు చాలడం లేదని ప్రణాళికకు మించి ఉపసంహరణ బాట పడితే పెట్టుబడి వేగంగా క్షీణిస్తుంది.
→ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడి విలువ ఏటా ఎంతో కొంత వృద్ధి చెందడమే కాదు.. అదే ద్రవ్యోల్బణం కారణంగా పెరిగే జీవన అవసరాలకు వీలుగా నగదు ఉపసంహరణ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. సరైన ప్రణా ళికతోనే ఇది సాధ్యమని గుర్తుంచుకోవాలి.
సిప్
ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిప్ ద్వారా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. కాంపౌండింగ్ మహిమతో కొద్ది పెట్టుబడి దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గంత నిధిగా సమకూరుతుంది. 25 ఏళ్ల వయసు నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఈక్విటీ ఫండ్లో సిప్ ప్రారంభించి, 60 ఏళ్లు వచ్చే వరకు 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే.. 12% వార్షిక రాబడి అంచనా మేరకు చివర్లో సమకూరే మొత్తం రూ.5.51 కోట్లు. ఇందులో పెట్టుబడి రూ.42 లక్షలు కాగా, మిగిలినదంతా కాంపౌండింగ్తో వృద్ధి చెందిన సంపద. కొంచెం ఆలస్యంగా 30 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసినా 60 ఏళ్లకు రూ.3.08 కోట్లకు సమకూరుతుంది.
ఎస్డబ్ల్యూపీ
సిప్ ద్వారా ఈక్విటీల్లో చేసిన పెట్టుబడి 60 ఏళ్లకు పెద్ద మొత్తమే సమకూరుతుంది. వృద్ధాప్యానికి వచ్చామని చెప్పి ఈక్విటీ పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోనక్కర్లేదు. కనీసం 50–70 శాతం మేర ఈక్విటీల్లో అలాగే కొనసాగించి, ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా కావాల్సినంత ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడి ఇతర సాధనాల కంటే మెరుగ్గా వృద్ధి చెందుతుంది. రిటైర్మెంట్ అనంతరం అదే ఫండ్ నుంచి ప్రతి నెలా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడులు అన్నింటినీ విక్రయించడం వల్ల దీర్ఘకాల మూలధన లాభాలపై (రూ.1.25 లక్షలు దాటిన మొత్తంపై) 12.5% పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీని బదులు 50–70% ఈక్విటీల్లోనే కొనసాగిస్తే పన్ను భారం తగ్గుతుంది.
ఎస్డబ్ల్యూపీ వ్యూహం
→ రిటైర్మెంట్ ఫండ్ను మూడు భాగాలుగు చేసుకోవాలి.
→ ఇందులో కోర్ భాగం ఒకటి. దీర్ఘకాలం పాటు ఇది మెరుగ్గా వృద్ధి చెందేందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలిస్తాయి.
→ బఫర్ పేరుతో రెండో భాగంలో.. 3 నుంచి 5 ఏళ్ల పాటు ఆదాయ అవసరాలకు సరిపడా మొత్తాన్ని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
→ లిక్విడ్ పేరుతో మరొక భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తక్షణ అవసరాల్లో వెనక్కి తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
→ తమ పెట్టుబడిని ఇలా వేర్వేరు భాగాలు చేసుకోవడం ద్వారా రిస్క్ను వైవిధ్యం చేసుకోవచ్చు.
– సాక్షి, బిజినెస్ డెస్క్