న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన ఆధారిత హైపర్స్కేల్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు 2035కల్లా 100 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. దీంతో సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సపోర్టింగ్ పరిశ్రమల ద్వారా మరో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా 250 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు వీలు కలగనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది.
అదానీ గ్రూప్ (Adani Group) ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా అధిక విద్యుత్ వినియోగ సామర్థ్యం, ఫైబర్ కనెక్టివిటీ, భూసౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి హైపర్స్కేల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, వాయు విద్యుత్ ప్లాంట్లతో నేరుగా అనుసంధానం చేసి గ్రీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల డిజిటల్ మౌలిక సదుపాయాలను దేశంలోనే సృష్టించడం సాధ్యమవుతుందని సంస్థ పేర్కొంది.
ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) ఆధ్వర్యంలో సర్వర్ తయారీ యూనిట్లు, క్లౌడ్ సర్వీసులు, డేటా స్టోరేజ్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే ఐటీ, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు, భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


