పర్యావరణం నుంచి ప్రాఫిట్ దాకా పోటీ
టాప్లో హెచ్యూఎల్
రెండో స్థానంలో హెచ్సీఎల్ టెక్
హరితహోరులో డాక్టర్ రెడ్డీస్, దివీస్కి కూడా చోటు
పర్పెచ్యువల్ క్యాపిటల్ హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 లిస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, సానుకూల ప్రభావం చూపుతున్న 50 దేశీ కంపెనీల్లో హిందుస్తాన్ యూనిలీవర్ అగ్రస్థానంలో నిలి్చంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో నిల్చాయి.
పర్పెచ్యువల్ క్యాపిటల్, హురున్ ఇండియా 50 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్ కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఎస్డీజీ లక్ష్యాలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా 150 కంపెనీలను వడబోసి ఈ జాబితాను రూపొందించినట్లు హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహా్మన్ జునైద్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.
కంపెనీలు ఈ లక్ష్యాలను నివేదికలకు పరిమితం చేయకుండా, వ్యాపార వ్యూహాల్లో భాగంగా మార్చుకుంటున్నాయని వివరించారు. వినియోగ, వాణిజ్య, సామాజిక రంగాలపై అర్థవంతమైన ప్రభావం చూపే సంస్థలకు తాము తోడ్పాటు అందిస్తున్నామని పర్పెచ్యువల్ క్యాపిటల్ పార్ట్నర్స్ ప్రణవ్ ప్రశాంత్, అన్విత ప్రశాంత్ వివరించారు.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ ఎస్డీజీ లక్ష్యాల సాధన దిశగా కృషి చేస్తున్న కంపెనీల సంఖ్యకు సంబంధించి 26 సంస్థలతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, పుణే, అహ్మదాబాద్ తదుపరి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ళీ మెటల్స్, మైనింగ్ రంగం నుంచి అత్యధికంగా 7 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, ఎనర్జీ, కన్జూమర్ గూడ్స్ రంగాల నుంచి తలో మూడు కంపెనీలు ఉన్నాయి.
→ హిందుస్తాన్ యూనిలీవర్ 97 శాతం పునరుత్పాదక విద్యుత్ని వినియోగిస్తోంది. ళీ పర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఇప్పటికే తటస్థ ఉద్గార స్థాయిని సాధించగా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ తదితర అయిదు దిగ్గజ కంపెనీలు ఇందుకోసం 2030ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
→ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలపై జాబితాలోని కంపెనీలు రూ. 8,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయగా, 20 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరింది. పర్యావరణ పరిరక్షణపరమైన చర్యలకు కంపెనీలు (48 సంస్థలు) అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి.
→ లిస్టులోని 50 కంపెనీల మొత్తం ఆదాయం రూ. 48.5 లక్షల కోట్లుగా, లాభం రూ. 4.95 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.7 లక్షల కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది.


