List Of Forbes India Billionaires 2022: Mukesh Ambani Tops In List - Sakshi
Sakshi News home page

Forbes Billionaires List 2022:సంపన్నుల జాబితాలో ​కొత్త రికార్డులు..భారత్‌లోని టాప్‌-10 బిలియనీర్లు వీరే..!

Apr 5 2022 8:21 PM | Updated on Apr 5 2022 9:14 PM

Mukesh Ambani Tops Forbes 2022 List of India 10 Richest Billionaires - Sakshi

సంపన్నుల జాబితాలో భారత్‌ రికార్డులు..భారత్‌లోని టాప్‌-10 బిలియనీర్లు వీరే..!

భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ తర్వాతి స్థానంలో   ఉండగా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌  శివ నాడార్‌ మూడో స్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్ 2022 జాబితాలో మొదటి మూడు ర్యాంకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం... ముకేష్‌ అంబానీ మొత్తం సంపద గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతం పెరిగి 90.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తిగా కాకుండా ప్రపంచంలోని పదవ సంపన్నుడిగా ముకేష్‌ అంబానీ రికార్డు సృష్టించారు.

ఫోర్బ్స్ జాబితాలో అంబానీ తర్వాతి స్థానంలో గౌతమ్‌ అదానీ, మొత్తం 90 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.  కోవిడ్-19 వ్యాక్సినేషన్స్‌ ఉత్పత్తి చేస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా 24.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో నాల్గవ స్థానంలో నిలిచారు. డీమార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ 20 బిలియన్‌ డాలర్ల నికర విలువతో ఐదో స్థానంలో నిలిచారు. కాగా గత ఏడాది ప్రపంచంలోని 100 మంది సంపన్నుల జాబితాలోకి రాధాకిషన్‌ ప్రవేశించారు. 

స్టీల్‌ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ నికర విలువ 17.9 బిలియన్ డాలర్లతో  ఆరో స్థానంలో... జిందాల్ గ్రూప్ మాతృక సావిత్రి జిందాల్ 17.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ఏడో స్థానంలో, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ బిర్లా 16.5 బిలియన్ డాలర్ల నికర విలువతో  ఎనిమిదో స్థానంలో, సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ షాంఘ్వీ 15.6 బిలియన్ డాలర్ల నికర విలువతో తొమ్మిదో స్థానంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ 14 బిలియన్ డాలర్ల నికర విలువతో పదో స్థానంలో నిలిచారు. ఇక భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గతేడాది 140గా ఉండగా ఇప్పుడు  రికార్డు స్థాయిలో 166కు చేరుకుందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా కంపెనీలు దాదాపు 15.6 బిలియన్‌ డాలర్లను సమీకరించాయని ఫోర్బ్స్‌ వెల్లడించింది. 

చదవండి: ఐవోసి మాస్టర్‌ ప్లాన్‌.. అంబానీ, అదానీలే కాదు మేము వస్తున్నాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement