కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించడమే కాకుండా 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం చేయడం విశేషం. రూ.53.47 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ మంత్రి ప్రకటనలు కీలకంగా కింది విధంగా ఉన్నాయి.
ఆదాయపు పన్ను
పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఈసారి పన్ను శ్లాబుల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ సరళీకరణపై దృష్టి సారించారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ఐటీ రిటర్నులను సవరించుకునే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే పరిహారంపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.
విదేశీ విద్య, వైద్యం, టూర్ ప్యాకేజీలపై ‘ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్’ (టీసీఎస్)ను 5% నుంచి 2%కి తగ్గించారు.
మౌలిక సదుపాయాలు, రవాణా
దేశాభివృద్ధికి ఇంజిన్లుగా భావించే మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు.
మెట్రో నగరాలను అనుసంధానిస్తూ 7 కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు.
కొత్తగా 20 జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.
అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లను కేటాయించారు.
సాంకేతికత, పరిశ్రమలు
భారత్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా చిప్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.40,000 కోట్లు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు.
ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.10,000 కోట్ల నిధిని ప్రకటించారు.
ఆరోగ్య, రక్షణ రంగాలు
క్యాన్సర్ మందులు: 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ప్రాణరక్షక మందులు చౌకగా లభించనున్నాయి.
దేశ భద్రత కోసం రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లను కేటాయించారు.
ఆర్థిక లోటు, వృద్ధి రేటు
భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి నమోదు చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
2026-27 సంవత్సరానికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్


