పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే కష్టమే
ఎల్ఐసీ సీఈవో ఆర్ దొరైస్వామి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం పాటు కొనసాగితే బీమా రంగం వృద్ధి మందగించొచ్చని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధాని చెప్పినట్టు మనం కష్టకాలాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడకుండా రక్షణ కలి్పంచారు. ఒకవేళ ఈ సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది వ్యక్తుల ఖర్చులు, పొదుపులను ప్రభావితం చేస్తుంది.
ఈ సంక్షోభం సాధ్యమైనంత త్వరలో ముగిసి, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నాం’’అని దొరైస్వామి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ప్రభావితమైతే బీమా రంగం దీనికి దూరంగా ఉండలేదన్నారు. వ్యక్తుల ఆదాయాలు, వారి సామర్థ్యాలు ప్రభావితమైతే బీమా రంగంపైనా ప్రభావం చూపిస్తుందన్నారు.
ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో మరికొంత విక్రయించే విషయమై ఎదురైన ఒక ప్రశ్నకు.. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దొరైస్వామి చెప్పారు. లిస్టింగ్ నిబంధనలను పాటించడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించినట్టు దొరైస్వామి పేర్కొన్నారు. వాటాలను దశల వారీగా 10–15 శాతం మేర తగ్గించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. 2022లో ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాలను రూ.21,000 కోట్లకు విక్రయిచడం గమనార్హం.


