
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు ఆదాయపు పన్ను శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో శనివారం ఈ ఆర్డర్ను అందుకుంది. పెనాల్టీ ఆర్డర్ను సంస్థ ఖండిస్తూ.. చట్టపరమైన చర్యలతోనే ముందుకు వెళ్తామని సవాలు చేసింది.
ఆదివారం జరిగిన రెగ్యులేటరీ ఫైలింగ్లో.. ఆదాయపు పన్ను అథారిటీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ జరిమానా విధించబడిందని ఇండిగో స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు ఇండిగో చేసిన అప్పీల్ కొట్టివేయబడిందని అథారిటీ తప్పుగా భావించింది. అయితే అప్పీల్ ఇప్పటికీ క్రియాశీలంగా ఉంది. తీర్పు కూడా పెండింగ్లో ఉంది. ఈ ఆర్డర్ చట్ట పరిధిలోకి రాలేదని కంపెనీ వెల్లడిస్తూ.. ఈ జరిమానాను ఎదుర్కోవడానికి చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తామని ఇండిగో స్పష్టం చేసింది.
ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఆర్డర్ వల్ల.. కంపెనీ ఆర్థిక, కార్యకలాపాలు లేదా మొత్తం వ్యాపార కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఇండిగో స్పష్టం చేసింది. ఇప్పటికే పలు ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ఇండిగో ఇప్పుడు తాజాగా జరిమానాకు సంబంధించిన పెనాల్టీ ఆర్డర్ను అందుకుంది.
ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు
విమానయాన సంస్థ ఇటీవల FY25 మూడవ త్రైమాసికంలో దాని నికర లాభంలో 18.6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఆదాయాలు కూడా రూ.2,998.1 కోట్ల నుంచి రూ.2,448.8 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా ఆదాయం తగ్గడానికి కారణమైందని కంపెనీ వెల్లడించింది.