ఇండియా ఏఐ మిషన్‌లోకి ఎనిమిది కంపెనీలు | IndiaAI Mission govt selected eight new players to build LLMs | Sakshi
Sakshi News home page

ఇండియా ఏఐ మిషన్‌లోకి ఎనిమిది కంపెనీలు

Sep 19 2025 10:09 AM | Updated on Sep 19 2025 10:33 AM

IndiaAI Mission govt selected eight new players to build LLMs

కృత్రిమ మేధలో ఆధిపత్యం కోసం భారతదేశం సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను నిర్మించడానికి ప్రభుత్వం ఎనిమిది కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఏఐ ల్యాండ్‌స్కేప్‌ను శక్తివంతం చేయడానికి, భారతీయ భాషలు, పాలనా అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను రూపొందించడానికి తోడ్పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీలు విభిన్న భాషా, సాంస్కృతిక సాంకేతికలను కలిగి ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇవి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇండియా ఏఐ మిషన్‌లో భాగమవుతున్న కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • టెక్ మహీంద్రా - 8 బిలియన్‌ పారామీటర్ ఎల్‌ఎల్‌ఎంను నిర్మించే పనిలో ఉంది. టెక్ మహీంద్రా మోడల్ దేశవ్యాప్తంగా భాషా అంతరాలను తగ్గించే లక్ష్యంతో హిందీ మాండలికాల అవగాహన, ప్రాసెసింగ్‌ను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. హిందీ కేంద్రీకృత ఎల్‌ఎల్‌ఎంను అభివృద్ధి చేసేందుకు ప్రాథమికంగా రూ.1.06 కోట్లతో మద్దతు ఇచ్చింది.

  • ఫ్రాక్టల్ అనలిటిక్స్ - తార్కికత ఆధారిత నమూనాలపై దృష్టి సారించింది. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఆరోగ్య సంరక్షణ, విశ్లేషణ, జాతీయ భద్రత కోసం ఎల్‌ఎల్‌ఎంలపై పని చేస్తుంది. ఈ విధాన కేంద్రీకృత నమూనాల కోసం రూ.34.58 కోట్లు కేటాయించారు.

  • భారత్ జెన్ - ఐఐటీ బాంబే నేతృత్వంలో భారత్ జెన్ బహుభాషా అప్లికేషన్లను, రీజినల్‌ నాలెడ్జ్‌తో సహా భారతీయ యూజర్‌ కేసుల కోసం రూపొందించిన 1-ట్రిలియన్ పారామీటర్ మోడల్‌ను రూపొందించడానికి సిద్ధమవుతోంది. ఐఐటీ బాంబే-భారత్ జెన్ కోసం రూ.988.6 కోట్లు కేటాయించారు.

  • అవతార్ AI, షోధ్ AI, జీన్‌టిక్‌, ఏఐటెక్‌ ఇన్నోవేషన్స్, జెన్‌లూప్‌ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూరోడిఎక్స్ (ఇంటెల్లిహెల్త్) వంటి కంపెనీలు ఆరోగ్య సంరక్షణ, ఫిన్‌టెక్‌, అధునాతన సాంకేతిక పరిష్కారాలు వంటి విభాగాల్లో సర్వీసులు అందించనున్నాయి.

ఏఐ పరిశోధన, వాటి మోడళ్ల శిక్షణకు భారతదేశం ఇప్పటికే 38,000 జీపీయూలను ఏర్పాటు చేసింది. 2025 చివరి నాటికి వీటిని 50,000కి పెంచాలని యోచిస్తోంది. ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా హిందీ, ప్రాంతీయ మాండలికాలు, ఇతర భారతీయ భాషలకు అనుగుణంగా ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నమూనాలు వ్యవసాయం, ఆర్థిక, న్యాయ సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాలలో ఏఐ అప్లికేషన్లకు మద్దతు ఇస్తాయి. క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడం, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఈ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 500+ ఏఐ డేటా ల్యాబ్‌లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ప్రతిభ, మౌలిక సదుపాయాల కోసం ఇంక్యుబేటర్లుగా పనిచేస్తాయి. తరువాతి తరం ఏఐ ఆవిష్కర్తలను తయారు చేస్తాయి.

ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?

Advertisement
 
Advertisement
Advertisement