భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి | India needs to build its own foundational artificial intelligence model | Sakshi
Sakshi News home page

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

Jun 23 2026 12:25 AM | Updated on Jun 23 2026 1:25 AM

India needs to build its own foundational artificial intelligence model

అప్పుడే కొత్త తరం టెక్నాలజీపై పట్టు సాధించవచ్చు 

అంతర్జాతీయంగా పోటీపడొచ్చు 

అమెరికా, చైనా ఏఐ మోడల్స్‌పై ఆధారపడితే రిస్క్ లు తప్పవు 

బెర్న్‌స్టైన్‌ నివేదిక

న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీపై పట్టు సాధించాలన్నా, అంతర్జాతీయంగా పోటీపడాలన్న భారత్‌ తనకంటూ సొంతంగా ’డీప్‌సీక్‌’లాంటి ఏఐ మోడల్‌ని తయారు చేసుకుని తీరాలని బ్రోకరేజ్‌ దిగ్గజం బెర్న్‌స్టైన్‌ ఒక నివేదికలో స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో అమెరికా లేదా చైనాకు  చెందిన ఏఐ మోడల్స్‌పై ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా మరో దేశంపై ఆధారపడటం వల్ల రిస్క్ లు తప్పవని హెచ్చరించింది. లేటెస్ట్‌ ఏఐ మోడల్స్‌ అందరికీ అందకుండా అమెరికా ఇటీవల ఆంక్షలు విధించడమనేది గ్లోబల్‌గా ఏఐ రేసులో కీలక మలుపని అభివర్ణించింది. 

అధునాతన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ని (ఎల్‌ఎల్‌ఎం) దేశాలు.. వ్యాపారపరమైన లాభాలు తెచ్చిపెట్టే సాఫ్ట్‌వేర్‌గా కాకుండా వ్యూహాత్మక అసెట్స్‌గా పరిగణిస్తుండటాన్ని ఇది సూచిస్తోందని కూడా నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో భారత్‌ విదేశీ ఏఐ మోడల్స్‌పై ఆధారపడుతూ, కేవలం అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌పైనే దృష్టి పెట్టే పక్షంలో భవిష్యత్‌ తరపు టెక్నాలజీపై నియంత్రణ కోల్పోయే ముప్పు తలెత్తుతుందని బెర్న్‌స్టైన్‌ పేర్కొంది. ‘వేరే వాళ్ల దగ్గరనుంచి అప్పుగా తీసుకున్న మోడల్స్‌ ఆధారంగా భారత్‌ తన ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేదు. విదేశీ ఎల్‌ఎల్‌ఎంల ఆధారంగా అప్లికేషన్లను తయారు చేసేటువంటి ప్రస్తుత వ్యూహం వల్ల భౌగోళిక రాజకీయపరమైన రిస్క్ లను ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది.  

ఏఐ.. కొత్త తరం ఫైటర్‌ జెట్‌.. 
కృత్రిమ మేధ మోడల్స్‌ని మిలిటరీ అసెట్స్‌గా బెర్న్‌స్టైన్‌ అభివర్ణించింది. సెమీకండక్టర్‌ పరికరాలు, గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల (జీపీయూ) నుంచి వినూత్న ఏఐ మోడల్స్‌ వరకు అధునాతన సాంకేతికతలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ‘ఏఐ అనేది కొత్త తరం ఫైటర్‌ జెట్‌‘లాంటిదని పేర్కొంది. ఫౌండేషనల్‌ మోడల్స్‌ని వివిధ దేశాలు కేవలం సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులుగా కాకుండా వ్యూహాత్మక వనరులుగా పరిగణిస్తున్నాయని వివరించింది. దేశ భద్రత, ఇతర దేశాలపై ఆర్థికంగా పైచేయి సాధించే కోణంలో వాటిని కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నాయని నివేదిక తెలిపింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement