2026–27లో చేరుకోవాలన్నది లక్ష్యం
మూడు సంవత్సరాల్లో రెట్టింపు
ఐఐఎఫ్సీఎల్ ఎండీ రోహిత్ రిషి
ప్రభుత్వరంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్సీఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (రూ.2026–27) రూ.లక్ష కోట్ల రుణ మార్క్ను అధిగమించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ‘‘2025 డిసెంబర్ 31 నాటికి రుణ పుస్తకం రూ.80,515 కోట్లుగా ఉంది. ప్రస్తుత ధోరణి, వివిధ రంగాల్లో ప్రస్తుత ప్రాజెక్టుల ఆధారంగా చూస్తే మా రుణ పుస్తకం విలువ 2027 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు దాటనుంది’’అని ఐఐఎఫ్సీఎల్ ఎండీ రోహిత్ రిషి తెలిపారు. అంతేకాదు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో రుణ పుస్తకాన్ని రెట్టింపు చేసుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
క్రమశిక్షణతో కూడిన మదింపు ప్రమాణాలు, మెరుగైన ఆస్తుల నాణ్యత, నిధుల సమీకరణ వ్యూహాలు వృద్ధికి దోహదం చేస్తున్నట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్ షీటును విస్తరించుకోవడమే కాకుండా, అధిక నాణ్యతతో, వైవిధ్యమైన, జాతీయ మౌలిక ప్రయోజనాలకు అనుగుణంగా పటిష్ట రుణ పోర్ట్ఫోలియో నిర్మాణంపైనే మా ప్రధాన దృష్టి’’అని వివరించారు. మౌలిక రంగ అవసరాలకు అనుగుణంగా, తక్కువ వ్యయాలతో దీర్ఘకాలం కోసం దేశ, విదేశీ మార్కెట్ల నుంచి సైతం నిధులను సమీకరించుకోనున్నట్టు చెప్పారు.
లోగడ ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, జికా, ఈఐబీ, ప్రపంచ బ్యాంక్ తదితర సంస్థల నుంచి నిధులను పొందినట్టు తెలిపారు. ఎంఐజీఏ (ప్రపంచ బ్యాంక్ సంస్థ) సహకారంతో సావరీన్ గ్యారంటీ లేకుండా దీర్ఘకాలానికి బిలియన్ డాలర్ల నిధులు సమీకరించనున్నట్టు రోహత్ రిషి తెలిపారు. ఐఐఎఫ్సీఎల్లో కేంద్రానికి నూరు శాతం వాటా ఉంది.
ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!?


