టెక్ ప్రపంచంలో కొంతకాలంగా సాగుతున్న ఉద్యోగాల కోత (లేఆఫ్స్)పై కృత్రిమ మేధ (ఏఐ) దిగ్గజం, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీల్లో జరుగుతున్న ఉద్యోగాల తొలగింపునకు ఏఐ సాంకేతికతను సాకుగా చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొంతమంది టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, కేవలం స్మార్ట్గా కనిపించడానికి ఏఐని వాడుకుంటున్నారని ఇది వారి సోమరితనం(లేజీ నారేటివ్) అని మండిపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల క్రితం తీసేసి.. ఇప్పుడు ఏఐ అనడం ఏంటి?
ఉద్యోగ నష్టాలకు, ఏఐ విస్తరణకు ముడిపెడుతూ సాగుతున్న ప్రచారాన్ని జెన్సెన్ హువాంగ్ పూర్తిగా ఖండించారు. సాంకేతికత ఇప్పుడిప్పుడే వ్యాపారాలకు ఉపయోగకరంగా మారుతోందని, కానీ కంపెనీలు మాత్రం చాలా కాలం క్రితమే ఉద్యోగులను తొలగించాయని ఆయన గుర్తుచేశారు. ‘ఏఐ అనేది కేవలం గత ఆరు నెలలుగా మాత్రమే పూర్తిస్థాయిలో ఉత్పాదకతను ఇస్తూ కంపెనీలకు ఉపయోగకరంగా మారింది. మరి అలాంటప్పుడు రెండేళ్ల క్రితమే ఉద్యోగులను తొలగించిన కంపెనీలు.. దానికి ఏఐ కారణమని ఎలా చెబుతాయి? టెక్నాలజీ ఇప్పుడే మార్కెట్లోకి వస్తే.. అప్పుడే ఉద్యోగాలు ఎలా పోతాయి? నేను ఈ ధోరణిని తీవ్రంగా ద్వేషిస్తున్నాను’ అని హువాంగ్ అన్నారు. కొంతమంది వ్యాపార నాయకులు శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి ఉన్న అసలైన అంతర్గత కారణాలను దాచిపెట్టి కేవలం చర్చనీయాంశంగా మార్చడానికి ఏఐని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.
భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్యం
ప్రస్తుతం మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒకవైపు ఏఐ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే.. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవ కార్మికులను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళనను ఉద్యోగుల్లో పెంచుతున్నాయి. ఈ అంశంపై హువాంగ్ స్పందిస్తూ.. కార్పొరేట్ నాయకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘మనం అనవసరంగా ప్రజలను భయపెడుతున్నాం, ఇది చాలా బాధ్యతారాహిత్యం. ఏఐ చుట్టూ ఉన్న వాస్తవాలను, దానివల్ల కలిగే సమతుల్య ప్రయోజనాలను సమాజానికి వివరించడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలి’ అని ఆయన స్పష్టం చేశారు.
పీక్ స్టేజ్లో ఉద్యోగాల కోత: గణంకాలు ఏం చెబుతున్నాయి?
ఉత్పాదకతను పెంచడానికి, పనులను ఆటోమేట్ చేయడానికి పరిశ్రమలు ఏఐ సాధనాలను వేగంగా స్వీకరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ లేఆఫ్స్కు కేవలం అదే కారణం కాదని మార్కెట్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’ తాజా గణాంకాల ప్రకారం.. 2026లో ఇప్పటివరకు 150 టెక్ కంపెనీల్లోని 1,14,210 మందికి పైగా ఈ లేఆప్స్ ద్వారా ప్రభావితమయ్యారు. మొత్తమ్మీద, లేఆఫ్స్ వెనుక ఉన్న ఆర్థిక మాంద్యం భయాలు, కంపెనీల మితిమీరిన విస్తరణ, వ్యయాల తగ్గింపు వంటి అసలు కారణాలను పక్కనబెట్టి ప్రతిదానికీ సరికొత్త టెక్నాలజీ వైపు వేలెత్తి చూపడం సరికాదన్న ఎన్విడియా చీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు


