హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ‘ఏటీ-1 బాండ్ల’ సంక్షోభం | HDFC Bank Faces Governance Lapses Allegations Over AT-1 Bond Sales to NRIs | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ‘ఏటీ-1 బాండ్ల’ సంక్షోభం

Mar 30 2026 6:47 PM | Updated on Mar 30 2026 6:55 PM

HDFC Bank Faces Governance Lapses Allegations Over AT-1 Bond Sales to NRIs

మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి వ్యాఖ్యలు

దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పాలనాపరమైన లోపాలు, నైతిక విలువల వివాదంలో చిక్కుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌లోని ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) నిబంధనలకు విరుద్ధంగా అడిషనల్‌ టైర్-1 (ఏటీ-1) బాండ్లను విక్రయించిన వ్యవహారంలో బ్యాంక్ మేనేజ్‌మెంట్ వైఖరిపై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో బ్యాంక్ అనూహ్యంగా ఆలస్యం చేసిందని ఆరోపించారు.

ఏటీ-1 బాండ్లు అంటే ఏమిటి?

సాధారణ బాండ్లలాగా వీటికి నిర్ణీత గడువు ఉండదు. వీటిని ‘పెర్పెచువల్ బాండ్స్’ అని పిలుస్తారు. అంటే బ్యాంక్ లాభాల్లో ఉన్నంత కాలం వీటికి వడ్డీ (కూపన్‌) చెల్లిస్తూనే ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లినా లేదా మూతపడే స్థితికి వచ్చినా ఈ బాండ్లలోని పెట్టుబడిని బ్యాంక్ పూర్తిగా రద్దు చేసే అధికారం ఉంటుంది.

వీటిని ఎందుకు జారీ చేస్తారు?

అంతర్జాతీయ ‘బాసెల్-3’ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ వద్ద కొంత మేర కనీస మూలధనాన్ని ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో నష్టాలను తట్టుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈక్విటీ షేర్లను జారీ చేసి కొత్త భాగస్వాములను చేర్చుకోవడం కంటే, బాండ్ల ద్వారా నిధులు సేకరించడం బ్యాంకులకు సులభం. దీనివల్ల బ్యాంక్ యాజమాన్య హక్కులు మారవు.

దుబాయ్ బ్రాంచ్‌లో మిస్-సెల్లింగ్

క్రెడిట్ సూయిస్ బ్యాంక్‌కు చెందిన అత్యంత రిస్క్‌తో కూడిన ఏటీ-1 బాండ్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన దుబాయ్, బహ్రెయిన్ శాఖల ద్వారా ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు తప్పుగా విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ విక్రయాలను గుర్తించిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్‌ఎస్‌ఏ), బ్యాంక్ బ్రాంచ్‌పై కఠిన ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 26, 2025 నుంచి కొత్త క్లయింట్లను చేర్చుకోవడం లేదా కొత్త ఆర్థిక సేవలను అందించకుండా నిషేధించింది. అంతర్గత దర్యాప్తు అనంతరం, ఈ నెలలో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. మరో 12 మంది సిబ్బందిపై వివిధ స్థాయిల్లో జరిమానాలు విధించినట్లు మార్చి 23 నాటి ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడైంది.

ఎనిమిదేళ్లుగా ఏం చేస్తున్నారు?

ఇటీవల అకస్మాత్తుగా రాజీనామా చేసిన చక్రవర్తి బ్యాంక్ తీరును తూర్పారబట్టారు. ‘గత ఎనిమిదేళ్లుగా లోపాలు జరుగుతున్నా బ్యాంక్ మౌనంగా ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు మేల్కొని చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇది మొదట్లో కేవలం డాక్యుమెంటేషన్ సమస్యగా భావించినప్పటికీ ఇది బ్యాంక్ ప్రతిష్టకు తీరని నష్టం కలిగించింది’ అని చెప్పారు. బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ పుననియామకం విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీశన్ నియామక ప్రక్రియ తన పర్యవేక్షణలో కానీ, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్‌ఆర్‌సీ) పరిధిలో కానీ జరగలేదని స్పష్టం చేశారు.

పెట్టుబడిదారుల్లో ఆందోళన

ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి సంస్థ విలువలు, నైతికత అంశాలపై విభేదించి తప్పుకోవడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో బ్యాంక్ షేర్ల విలువపై ప్రభావం పడకుండా ఉండేందుకు యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే, చక్రవర్తి రాజీనామాకు గల కచ్చితమైన కారణాలను బ్యాంక్ అధికారికంగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అవకతవకలపై ఆర్‌బీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement