భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఎప్పటి నుంచో.. ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకలు వంటి ప్రతి ముఖ్యమైన సందర్భంలో బంగారం కొనడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలకు కొత్త ఆభరణాలు కొనడం కష్టంగా మారుతోంది. పసిడి తన మెరుపును కోల్పోలేదు కానీ అది మధ్యతరగతి, సాధారణ కుటుంబాల అందుబాటుకు దూరమవుతోంది.
రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో.. బంగారు ఆభరణాల అమ్మకాల తగ్గుతున్నట్లు తెలిసింది. ప్రజలు కొనుగోలు చేసే బంగారం బరువు తగ్గుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం అమ్మకాల పరిమాణం సుమారు 8% తగ్గిందని, ఇంకా ఈ ఏడాది 13-15% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇది గత పదేళ్లలోనే కనిష్ట స్థాయి అని పేర్కొంది. దీనికి కారణం ధరల పెరుగుదల, దిగుమతి సుంకం పెంపు.
భారతదేశంలో వినియోగించే బంగారం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతం వరకు పెంచింది. దీని వల్ల బంగారం ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,60,000 వరకు చేరింది. అందువల్ల ప్రజలు అవసరమైన ఆభరణాలకే పరిమితం అవుతున్నారు.
అయితే.. బంగారం అమ్మకాల పరిమాణం తగ్గినా, దాని విలువ మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే తక్కువ బంగారం కొనుగోలు చేసినా, అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా జువెలరీ కంపెనీల ఆదాయం 20-25% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కంపెనీలు అమ్మే బంగారం బరువు తగ్గినా, అధిక ధరల వల్ల వారి ఆదాయం తగ్గడం లేదు.
ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!


