పీఎఫ్, ఈఎస్ఐ విరాళాల చెల్లింపులో ఊరట | Finance Bill 2026 introduces major relief for employers PF ESI contributions | Sakshi
Sakshi News home page

పీఎఫ్, ఈఎస్ఐ విరాళాల చెల్లింపులో ఊరట

Feb 3 2026 12:15 PM | Updated on Feb 3 2026 12:24 PM

Finance Bill 2026 introduces major relief for employers PF ESI contributions

వ్యాపార యజమానులకు, సంస్థలకు భారీ ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్‌), ఈఎస్ఐ (ఈఎస్‌ఐ) వంటి సంక్షేమ నిధుల విరాళాల విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలిస్తూ ‘ఫైనాన్స్ బిల్లు 2025’లో కీలక ప్రతిపాదనలు చేసింది.

ప్రస్తుత సవాలు.. సుప్రీంకోర్టు తీర్పు

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం యజమానులు తమ ఉద్యోగుల నుంచి సేకరించిన పీఎఫ్, ఈఎస్ఐ చందాలను సంబంధిత చట్టాలు నిర్దేశించిన గడువులోపే (సాధారణంగా నెల ముగిసిన 15 రోజుల్లోపు) జమ చేయాలి. ఒకవేళ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్ చేసే అవకాశాన్ని యజమానులు కోల్పోతారు. దీనిపై సుదీర్ఘకాలం సాగిన వివాదానికి సుప్రీంకోర్టు గతంలో తీర్పునిస్తూ నిర్దేశిత గడువు దాటితే పన్ను ప్రయోజనం పొందేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఇది యజమానులకు ఆర్థికంగా అదనపు భారాన్ని కలిగిస్తోంది.

ప్రతిపాదిత మార్పు.. సెక్షన్ 29 సవరణ

తాజాగా ఫైనాన్స్ బిల్లులో ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 29కి సవరణను ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ఇకపై ఉద్యోగుల విరాళాల తగ్గింపును క్లెయిమ్ చేయడానికి గడువు తేదీని, ఆయా సంస్థల ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌) దాఖలు చేసే గడువు తేదీతో అనుసంధానిస్తారు. సంబంధిత సంక్షేమ చట్టాల ప్రకారం గడువు తేదీ దాటినప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే లోపు ఆ మొత్తాన్ని జమ చేస్తే యజమానులు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.

నిపుణుల విశ్లేషణ

ఈ మార్పుపై సుప్రీంకోర్టు న్యాయవాది దీపక్ జోషి స్పందిస్తూ ‘ప్రస్తుతం యజమానులు అత్యంత కఠినమైన ప్రమాణాలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఐటీ రిటర్న్ దాఖలు చేసేలోపు విరాళాలు చెల్లించినా మినహాయింపు దక్కేది కాదు. కానీ ఈ ప్రతిపాదిత సవరణ వల్ల కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ, రిటర్న్ ఫైలింగ్ లోపు చెల్లింపు పూర్తి చేస్తే యజమానులకు మినహాయింపు లభిస్తుంది’ అని వివరించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనవసరమైన కోర్టు వ్యాజ్యాలు తగ్గడమే కాకుండా వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కానుంది. చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల లేదా నగదు కొరత వల్ల చెల్లింపులు ఆలస్యమైనా యజమానులు శాశ్వతంగా పన్ను ప్రయోజనాలు కోల్పోకుండా ఈ సవరణ రక్షణ కల్పిస్తుంది.

ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement