17 ఏళ్ల కనిష్టానికి విదేశీ పెట్టుబడులు
జూన్కల్లా 15.1 శాతానికి వాటా డౌన్
ఎన్ఎస్ఈ మార్కెట్ పల్స్ నివేదిక
ముంబై: కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ ఈక్విటీలలో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. గత క్యాలండర్ ఏడాది(2025) బాటలో 2026లోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికానికల్లా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో ఎఫ్పీఐల వాటా 15.1 శాతానికి క్షీణించింది.
ఇది గత 17ఏళ్లలోనే కనిష్టంకాగా.. ఆగస్ట్ 2026 ఎన్ఎస్ఈ మార్కెట్ పల్స్ నివేదిక ఇంకా పలు అంశాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఎఫ్పీఐలు 15.1 బిలియన్ డాలర్ల(రూ. 1,43,150 కోట్లు) విలువైన అమ్మకాలు చేపట్టారు. వెరసి 2026లో జూన్ చివరికల్లా ఎఫ్పీఐలు దేశీ ఈక్విటీల నుంచి నికరంగా రూ. 2,30,752 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
దేశీ ఫండ్స్ దన్ను..: ఎఫ్పీఐలకు విరుద్ధమైన బాటలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ వాటా వరుసగా 12వ క్వార్టర్(ఏప్రిల్–జూన్)లోనూ మెరుగుపడింది. జూన్కల్లా 11.6%కి పుంజుకుంది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా 19.5%కి బలపడింది. ఫలితంగా దేశీ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పీఐలను మించుతూ డీఐఐలు వరుసగా ఏడో క్వార్టర్లోనూ అధిక వాటాను నిలుపుకున్నారు. ఇంతక్రితం 2003లో మాత్రమే ఎఫ్పీఐ వాటాను డీఐఐలు అధిగమించడం గమనార్హం!


