
మార్చిలో ఈక్విటీ ఫండ్స్లోకి రూ.25వేల కోట్లు
నాలుగు నెలల కనిష్టానికి సిప్ పెట్టుబడులు
ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై అస్థిరతల ప్రభావం
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్కు కొనసాగిన ఆదరణ
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడుల రాక మార్చి నెలలో రూ.25,082 కోట్లకు తగ్గింది. నెలవారీ ఈక్విటీ పెట్టుబడుల్లో ఇది 11 నెలల కనిష్టం (2024 ఏప్రిల్ తర్వాత) కావడం గమనార్హం. ఫిబ్రవరిలో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన నికర పెట్టుబడులు29,303 కోట్లుగా ఉన్నాయి. అటు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చే పెట్టుబడులు సైతం నాలుగు నెలల కనిష్టానికి తగ్గి రూ.25,925 కోట్లుగా నమోదయ్యాయి.
ముఖ్యంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. ఈ మేరకు మార్చి నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక క్రమంగా తగ్గుతోంది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.4.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2023–24లో వచ్చిన రూ.1.84 లక్షల కోట్లతో పోల్చితే గణనీయంగా పెరిగాయి.
సిప్ ఫర్వాలేదు..
సిప్ పెట్టుబడులు మార్చిలో రూ.25,925 కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.25,999 కోట్లు, జనవరిలో రూ.26,400 కోట్లు, 2024 డిసెంబర్లో రూ.26,459 కోట్ల చొప్పున సిప్ ద్వారా ఫండ్స్లోకి పెట్టుబడులు వచ్చాయి. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు సిప్ పెట్టుబడులు రూ.24,113 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.16,602 కోట్ల చొప్పున ఉంది.
→ మార్చిలో అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి రూ. 5,165 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
→ ముఖ్యంగా సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిలో పూర్తి మార్పు కనిపించింది. ఫిబ్రవరిలో ఈ విభాగం ఇన్వెస్టర్ల నుంచి రూ.5,711 కోట్లను ఆకర్షించగా.. మార్చిలో రూ.735 కోట్లకు పెట్టుబడులు తగ్గిపోయాయి.
→ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడుల జోరు కొనసాగింది. మిడ్క్యాప్ ఫండ్స్ రూ.3,439 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.4,092 కోట్ల చొప్పున ఆకర్షించాయి. → లార్జ్క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులు రూ.2,479 కోట్లకు తగ్గాయి. ఫిబ్రవరిలో ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.2,866 కోట్లుగా ఉన్నాయి.
→ మార్చి నెలలో డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఉపసంహరణ రూ.6,525 కోట్లుగానే ఉంది.
→ లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.1.33 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆ తర్వాత ఓవర్నైట్ ఫండ్స్ నుంచి రూ.30,015 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి రూ.21,301 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
→ గోల్డ్ ఈటీఎఫ్లలో రూ.77 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఫిబ్రవరిలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్టర్లు రూ.1,980 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
→ మొత్తం మీద మార్చి నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ (అన్ని విభాగాలూ కలసి) రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయింది.
ప్రతికూలతల వల్లే..
సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గడం మొత్తం మీద ఈక్విటీ పెట్టుబడులను తగ్గించేసినట్టు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ మేనేజర్ నేహల్ మెష్రామ్ తెలిపారు. ‘‘ఇన్వెస్టర్లు అనిశ్చితులను ఇష్టపడరు. తరచూ వస్తున్న ప్రతికూల వార్తలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించారు’’అని యూనియన్ ఏఎంసీ సీఈవో మధునాయర్ పేర్కొన్నారు.
51 లక్షల సిప్ ఖాతాలు బంద్
మార్చి నెలలో సిప్ పెట్టుబడుల నిలిపివేత మరింత పెరిగింది. 51 లక్షల సిప్ ఖాతాల నుంచి పెట్టుబడులు ఆగిపోయాయి. అదే సమయంలో కొత్తగా 40 లక్షల సిప్ ఖాతాలను ఇన్వెస్టర్లు ప్రారంభించారు. నికరంగా చూస్తే 11 లక్షల మేర సిప్ ఖాతాలు తగ్గినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో సిప్ నిలిపివేత నిష్పత్తి 122 శాతంగా ఉంటే, మార్చి నెలకు 127.5 శాతానికి పెరిగింది.