కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల రాజీనామాలు, నోటీసు పీరియడ్ల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన కంటెంట్ స్ట్రాటజిస్ట్ నిషాంత్ జోషి పంచుకున్న ఒక ఘటన ఇందుకు ఆజ్యం పోసింది. తన సహోద్యోగికి కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు, 90 రోజుల నోటీసు పీరియడ్ తగ్గించాలని కోరగా.. అది ‘వృత్తిపరమైన నైతికత’ (Professional Ethics) అని హెచ్ఆర్ విభాగం బదులిచ్చింది. దీనికి ఆ ఉద్యోగి స్పందిస్తూ.. ‘గత నెలలో కంపెనీ మొత్తం డిజైన్ టీమ్ను ఉన్నపళంగా తొలగించినప్పుడు ఈ నైతికత ఏమైంది?’ అని ప్రశ్నించడంతో హెచ్ఆర్ నోట మాట రాలేదని జోషి పేర్కొన్నారు.
ద్వంద్వ నీతిపై ఆగ్రహం
ఉద్యోగులు వెళ్లేటప్పుడు మూడు నెలల సమయం కావాలని కోరే కంపెనీలు, వారిని తొలగించేటప్పుడు మాత్రం కనీస సమయం కూడా ఇవ్వకపోవడంపై నిషాంత్ జోషి విమర్శలు గుప్పించారు. ‘సంస్థ మిమ్మల్ని తీసివేయాలనుకున్నప్పుడు తెల్లవారుజామునే మీ ఆఫీస్ అకౌంట్లు అన్నీ డిసేబుల్ అవుతాయి.. అక్కడ అప్పగింతలు (Handover) ఉండవు, గౌరవం ఉండదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది పని సజావుగా సాగడం కోసం కంటే, ఉద్యోగి వేరే అవకాశాలకు వెళ్లకుండా అడ్డుకోవడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
నెటిజన్ల మద్దతు
ఈ పోస్ట్పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. అనేకమంది తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, కొత్తగా చేర్చుకునే అభ్యర్థి వెంటనే రావాలని కోరుకునే సంస్థలు, పాత ఉద్యోగిని మాత్రం 90 రోజులు వదలకపోవడం విడ్డూరమని మండిపడుతున్నారు. ఐటీ కన్సల్టింగ్ రంగంలో మొదలైన ఈ 90 రోజుల నిబంధన ఇప్పుడు అన్ని రంగాలకు పాకి ఉద్యోగులను వేధించే సాధనంగా మారిందని మరికొందరు విమర్శించారు. వృత్తిపరమైన నైతికత అనేది కేవలం ఉద్యోగులకే కాదు, సంస్థలకు కూడా వర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మార్పు అవసరం
ఈ చర్చ ద్వారా కార్పొరేట్ నిబంధనల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని నెటిజన్లు నొక్కి చెప్పారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది కాలం చెల్లిన పద్ధతి అని, ఇది ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా ఉద్యోగి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు తమ ప్రయోజనాలతో పాటు ఉద్యోగుల కెరీర్ వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకృతం చేయాలని, పరస్పర అవగాహనతో కూడిన పని వాతావరణం ఉండాలని ఈ చర్చ సారాంశం.


