Elon Musk Plans To Charge Form Twitter Users For 3 Major And Basic Features - Sakshi
Sakshi News home page

‘ఇదేం బాదుడు రా నాయనా’..ట్విటర్‌ యూజర్ల నుంచి 3 ఫీచర్లపై అదనపు ఛార్జీలు!

Nov 5 2022 9:32 PM | Updated on Nov 6 2022 8:32 AM

Elon Musk Plans To Charge Form Twitter Users For 3 Major And Basic Features - Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలన్‌ మస్క్‌ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు బ్లూటిక్‌ వెరిఫికేషన్‌పై 8 డాలర్లు వసూలు చేయనున్నట్లు ప్రకటించిన మస్క్‌.. తాజాగా మరో మూడు ఫీచర్లు వినియోగించిన యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
  
ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచి ఆ సంస్థలో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్‌ వెరిఫికేషన్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. తాజాగా సంస్థ ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాలని కోరడంతో పాటు..ట్విటర్‌లో మూడు ప్రధానమైన బేసిక్‌ ఫీచర్లను వినియోగించే ట్విటర్‌ యూజర్ల నుంచి అదనంగా కొంత మొత్తం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారంటూ ఆ నివేదికలు పేర్కొన్నాయి. 

డైరెక్ట్ మెసేజ్ (డీఎం)ని చెల్లింపు ఫీచర్‌గా మార్చడం గురించి సలహాదారులతో మస్క్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. హై ప్రొఫెల్‌ ట్విటర్‌ యూజర్లు ఇతర ట్విటర్‌ యూజర్లకు పర్సనల్‌గా మెసేజ్‌ పంపాలనుకుంటే..వారి వద్ద నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రస్తుతానికి, ‘హై-ప్రొఫైల్ యూజర్లు’ ఏ కేటగిరీలో వస్తారనే అంశంపై స్పష్టత లేదు.

వినియోగదారులు ట్విటర్‌లో వీడియోలు చూడాలనుకుంటే..అందుకోసం కొంత మొత్తాన్ని ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంది. వీడియోలను అప్‌లోడ్ చేయడానికి, వాటిని  చూసేందుకు ప్రయత్నించే వీక్షకుల నుంచి ఛార్జీలు వసూలు చేసేలా మస్క్‌ ఒక ఫీచర్‌పై వర్క్‌ చేస్తుందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.   
 
పేవాల్డ్ వీడియో అని పిలిచే ఈ ఫీచర్‌ను మరో రెండు మూడు వారాల్లో సిద్ధం చేయాలని మస్క్ కోరుకుంటున్నట్లు నివేదించింది. అలాగే, టైం డ్యూరేషన్‌ ఎక్కువ ఉన్న వీడియోలు లేదా ఆడియోను పోస్ట్ చేయాలనుకునే వారు ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా వరుసగా మూడు ఫీచర్లను వినియోగించుకున్న యూజర్లు అదనపు చార్జీల బాదుడు భరించాల్సిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement