కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి  | 59percent of Indian organisations faced financial or economic frauds | Sakshi
Sakshi News home page

కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి 

Dec 20 2024 4:19 AM | Updated on Dec 20 2024 7:59 AM

59percent of Indian organisations faced financial or economic frauds

59 శాతం భారత కంపెనీలకు ఇదే పరిస్థితి  

పీడబ్ల్యూసీ సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి పెరిగిపోయింది. గడిచిన 24 నెలల్లో తాము ఆర్థిక మోసాల బారిన పడినట్టు 59 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ క్రైమ్‌ సర్వే 2024’ రూపంలో ఈ వివరాలు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా 2,446 సంస్థల సీఈవోలు, ఎండీలు, బోర్డు సభ్యుల అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. భారత్‌ నుంచి 91 కంపెనీలు సర్వేలో పాల్గొన్నాయి. ‘‘సర్వేలో పాలు పంచుకున్న భారత కంపెనీల్లో 59 శాతం గత రెండేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు చెప్పాయి. 

అంతర్జాతీయ సగటు 41 శాతంతో పోలి్చతే 18 శాతం ఎక్కువ. 2022 ఎడిషన్‌ సర్వే ప్రకారం చూసినా భారత్‌లో 7 శాతం పెరుగుదల కనిపిస్తోంది’’అని ఈ సర్వే తెలిపింది. ప్రధానంగా కంపెనీల్లో ప్రొక్యూర్‌మెంట్‌ (కొనుగోళ్లు) విభాగంలో ఈ మోసాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు పీడబ్ల్యూసీ సర్వే తెలిపింది. తమకు ఇదొక ప్రధాన సమస్యగా 50 శాతం భారత కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సగటుతో పోల్చి చూస్తే 21 శాతం ఎక్కువ. ఇక 47 శాతం కంపెనీలకు కస్టమర్ల మోసాలు ఆందోళనకరంగా పరిణమించాయి. సైబర్‌ నేరాలు తమకు ప్రధాన సమస్య అని అంతర్జాతీయంగా 44 శాతం కంపెనీలు వెల్లడించాయి. 

ఎప్పటి నుంచో ఉన్నవే..  
‘‘చారిత్రకంగా చూస్తే ప్రొక్యూర్‌మెంట్‌ మోసాలు అన్నవి ఎప్పటి నుంచో ఉన్నవే. ఆర్థిక ప్రయోజనం పొందేందుకు కొనుగోళ్లలో (ప్రొక్యూర్‌మెంట్‌) అవకతవకలకు పాల్పడడం. ఈ ఏడాది మా సర్వేలో పాల్గొన్న భారత కంపెనీల ప్రతినిధుల్లో సగం మంది ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు’’అని పీడబ్ల్యూసీ ఇండియా ఫోరెన్సిక్‌ సరీ్వసెస్‌ పార్ట్‌నర్‌ పునీత్‌ గర్ఖేల్‌ తెలిపారు. ప్రొక్యూర్‌మెంట్‌ మోసాలను నివారించేందుకు భారత కంపెనీలు డేటా అనలైటిక్స్‌ను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. 33 శాతం ఆర్థిక నేరాలు అవినీతి, లంచాలకు సంబంధించినవేనని, గత రెండేళ్లలో టాప్‌–3 ప్రధాన ఆర్థిక నేరాల్లో ఇవి కూడా ఉన్నట్టు 26 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement