ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్న 25 సంస్థలు
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ పట్ల పదుల సంఖ్యలో కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఎన్ఎల్సీ ఇండియా, వేదాంత, హిందుస్థాన్ జింక్ సహా 25 కంపెనీలు ప్రభుత్వం నిర్వహించిన బిడ్ ముందస్తు సమావేశంలో (ప్రీ బిడ్) పాల్గొన్నాయి. మంగళవారం (7న) ఈ సమావేశం జరిగింది. దేశీయంగా సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రూ.7,280 కోట్ల ప్రోత్సాహకాలతో భారీ పరిశ్రమల శాఖ ఒక పథకాన్ని తీసుకురావడం గమనార్హం.
6,000 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎంటీపీఏ) సామర్థ్యంతో తయారీ కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వనిస్తూ మార్చి 20న ప్రకటన జారీ చేసింది. గరిష్టంగా ఐదు సంస్థలను బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ప్రతీ సంస్థ 1,200 ఎంటీపీఏ సామర్థ్యంతో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి ఉత్పత్తి సామర్థ్యం 6,000ఎంటీపీఏగా ఉంటుంది. బిడ్డింగ్ తేదీ మే 28 కాగా, సాంకేతిక బిడ్లను మే 29న తెరవనున్నారు.
‘‘ఆశావహ బిడ్డర్లకు స్కీమ్ వివరాలు, ముఖ్యమైన నిబంధనలు, బిబ్డింగ్ ప్రక్రియల గురించి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చాం. బిడ్డర్లు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించాం. ఈ నెల 22 వరకు తమ సందేహాలను ఈ–మెయిల్ ద్వారా తెలియజేయొచ్చని సూచించాం’’అని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. బిడ్డింగ్ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ఎల్రక్టానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల అవసరం ఎంతో ఉంటుంది.


