చుంచుపల్లి: జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి వచ్చే నెల 2వ తేదీవ రకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 471 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వంతో ప్రజలు కలిసి పనిచేసేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిశుభ్రతను పెంపొందించడంతోపాటు చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, ప్రజల్లో బాధ్యతను పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. స్వచ్ఛతలో భాగస్వామ్యం–స్వచ్ఛ భారత్–వికసిత భారత్ అనే స్ఫూర్తితో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయనున్నారు. ‘నా ఇల్లు–నా వీధి–నా గ్రామం–నా జిల్లా’ అనే నినాదంతో ప్రజలు ముందుకు వస్తే పరిశుభ్ర జిల్లాగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.
పాఠశాలల నుంచే పరిశుభ్రత
విద్యార్థులు, యువతలో చిన్ననాటి నుంచే పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వ్యర్థాలతో కళాకృతులు తయారు చేయడం, ఉపయోగపడే వస్తువులను రూపొందించడం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. 17,18 తేదీల్లో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, యువతతో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు, 19,20న చెత్త పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాలు, 21, 22న ప్రజలు ఎక్కువగా సంచరించే బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 23,24న ఇంటింటి అవగాహన, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు, 30న పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల పంపిణీ, సంక్షేమ కార్యక్రమాలు, అక్టోబర్ 1 ఉదయం 8 గంటలకు ‘ఒక రోజు.. ఒక గంట.. అందరం ఒక్కటిగా’అనే పిలుపుతో సామూహిక శ్రమదానం, అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గ్రామసభలు, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నేటి నుంచి అక్టోబర్ 2 వరకు
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు


