మణుగూరు డీప్సైడ్ బ్లాక్
గన్ఫౌండ్రీ(హైదరాబాద్): మణుగూరులోని పీకేఓసీ–2 డీప్సైడ్ బొగ్గు బ్లాక్ను జెన్కోకు కాకుండా సింగరేణికే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు వెలికితీతకు కనీస పరిజ్ఞానం, యంత్రాలు కూడా లేని జెన్కో ఈ వేలంలో పాల్గొనడం వల్ల మణుగూరు ఏరియాకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ఈ నెల 3న జరగనున్న బొగ్గు బ్లాక్ వేలం నుంచి జెన్కో తప్పుకుని, డీప్సైడ్ బ్లాక్ను నేరుగా సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవ చూపాలన్నారు. బొగ్గు వెలికితీతల్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న ప్రైవేట్ సంస్థలే ముందుకు రాకున్నా ఏ మాత్రం పరిజ్ఞానం లేని జెన్కో టెండర్లో పాల్గొనడం వెనుక ఇంధన శాఖలోని కొందరు అధికారుల హస్తం ఉందని ఆరోపించారు. మణుగూరు డీప్సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కకపోతే ఈ ఏరియాకు అన్యాయం జరగనున్నందున ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, నాయకుడు వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కాలరీస్ వర్కర్స్
యూనియన్ డిమాండ్


