● మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ● కలెక్టర్ అంకిత్
సూపర్బజార్(కొత్తగూడెం): గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా అధికారులతో గురువారం రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోదావరి స్నాన ఘాట్లు, పర్యాటక ప్రాంతాలు, నది తీర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు నదిలోకి వెళ్లకుండా చూడాలన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 28.40 అడుగులుగా నమోదైందని, నీటి ప్రవాహం 3,88,452 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కాగా ఆ సమయంలో సుమారు 9,32,288 క్యూసెక్కుల ప్రవాహం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.


