ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో మూడు ఫార్మసిస్టు పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా, గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే, మూడు పోస్టులకు గాను 304 మంది నిరుద్యోగులు హాజరుకావడం గమనార్హం. సూపరింటెండెంట్ చాంబర్ వద్ద వీరు బారులు దీరడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. ఆస్పత్రిలో కొంత కాలంగా ఫార్మసిస్ట్ల కొరత వేధిస్తుండగా.. ఆరుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఇటీవల ‘సాక్షిలో’ ‘గంటల కొద్దీ క్యూలైన్లోనే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, స్పందించిన అదనపు కలెక్టర్ శ్రీజ సూచనలతో ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ఉద్యోగం తాత్కాలికంగా నాలుగు నెలల పాటే ఉంటుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 2వేలకు పైగా ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా ఎప్పుడైనా ఫలితాలు వచ్చే అవకాశముంది. అందులో కొందరిని ఖమ్మం జీజీహెచ్కు కేటాయిస్తే ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునే వారే తప్పించనున్నారు. అయినా మూడు పోస్టులకు 304మంది హాజరు కావడంతో ఆస్పత్రి ఆవరణ కిటకిటలాడింది.
ఖమ్మం జీజీహెచ్లో ఔట్ సోర్సింగ్ ఫార్మసిస్టు ఉద్యోగాలకు బారులు


