గుండాల: సరదాగా స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు తిరిగిరాని లోకానికి వెళ్లాడు. గుండాల మండలంలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన గుగులోత్ దేవా–కల్పన కుమారుడు సీమాన్(11) ఇల్లెందు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆయన శనివారం సాయంత్రం స్నేహితులు వేణు, సంజుతో కలిసి గ్రామ సమీపాన మల్లన్న వాగులో ఈతకు వెళ్లాడు. తొలుత సీమాన్, వేణు దిగగా, ఇద్దరూ మునిగిపోతుండడంతో ఒడ్డుపై ఉన్న సంజు గుడి వద్ద ఉన్న గ్రామస్తులు సమాచారం ఇచ్చాడు. స్థానికులు వచ్చే సరికి సీమాన్ పూర్తిగా మునిగిపోగా వేణు ౖపైపెనే ఉండడంతో ఆయనను కాపాడారు. ఆతర్వాత గుండాల సీఐ తిరుపతి, ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యాన రెండు గంటల పాటు గాలించగా సీమాన్ మృతదేహం బయటపడింది. తరచుగా పిల్లలు వాగులో ఈతకు వెళ్తున్నా ఇన్నాళ్లు నీళ్లు ఎక్కువగా లేకపోవడంతో ఏమీ జరగలేదని చెబుతున్నారు. కానీ శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వరద చేరిన విషయం అంచనా వేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు వెల్లడించారు. ఓ పక్క తండాలో దుర్గమ్మ ప్రతిష్ట వేడుకలు జరుగుతుండగా మరోపక్క బాలుడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
వాగులో మునిగి బాలుడు మృతి


