సూపర్బజార్(కొత్తగూడెం): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుండడంతోనే నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన బుధవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఆకాశాన్ని అంటుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాక ధరల నివారణకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టకుండా, కార్పొరేట్ శక్తులకు తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ధరలను తగ్గించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, నాయకులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, వంగా వెంకట్, ఎస్కే ఫహీమ్, ధీటి లక్ష్మీపతి, కె.రత్నకుమారి, మునిగడప పద్మ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని


