రుద్రంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు ఉద్యమాల కార్యాచరణ రూపకల్పనకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను వేదికగా చేసుకోనున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ తెలిపారు. కొత్తగూడెంలో ఈనెల 23 నుంచి 25వ తీదీ వరకు సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జరగనుండగా, గురువారం కొత్తగూడెంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలో 50శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా కేంద్ర బడ్జెట్లో కనీస కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. అంతేకాక విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చి ఎరువులపై సబ్సిడీ తొలగించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో అరకొర కేటాయింపులతో రైతులను మోసం చేసిందన్నారు. ఈ సమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్న మహాసభలను విజయవంతం చేయాలని సుదర్శన్ కోరారు. ఈ సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జలసూత్రం శివరాంప్రసాద్, నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, ఎలమంచి వంశీకృష్ణ, కున్సోత్ ధర్మా, కొండబోయిన వెంకటేశ్వర్లు, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్రావు


