ధ్యానమందిరంపై ధ్యాసేది..? | - | Sakshi
Sakshi News home page

ధ్యానమందిరంపై ధ్యాసేది..?

Apr 29 2025 7:04 AM | Updated on Apr 29 2025 7:04 AM

ధ్యానమందిరంపై ధ్యాసేది..?

ధ్యానమందిరంపై ధ్యాసేది..?

● నిర్వహణ లేక చెరిగిపోతున్న కంచర్ల గోపన్న కీర్తనలు ● భద్రాచలంలో నిరుపయోగంగా భక్తరామదాసు మందిరం ● భజన మందిరంగా తీర్చిదిద్దాలని భక్తుల విన్నపం

భద్రాచలం: భద్రగిరిలోని భక్తరామదాసు ధ్యానమందిరంపై అధికారులకు పట్టింపు లేకుండా పోతోంది. రామాలయ నిర్మాణ కర్త, ప్రముఖ వాగ్గేయకారుడు, భక్త రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్నకు సముచిత స్థానం కల్పించేందుకు, ఆయన కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు నిర్మించిన ఆలయం శిథిలమవుతోంది. 53 ఏళ్ల విశిష్టత ఉన్న ధ్యాన మందిరం క్రమంగా ఆదరణ కోల్పోతోంది.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో శంకుస్థాపన..

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కంచర్ల గోపన్న జ్ఞాపకార్థం రంగనాయకుల గుట్టపై ధ్యాఽన మందిరం నిర్మించారు. 1962 జనవరి 5న నాటి ఉపరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ శంకుస్థాపన చేయగా, 1971, నవంబర్‌ 5న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. రెండు అంతస్తులతో మందిరం నిర్మించగా మొదటి అంతస్తులో రామదాసు రచించిన కీర్తనలను శిలాఫలాకలపై లిఖించి, వీటిని నాలుగు వైపులా గోడలపై ఏర్పాటు చేశారు. రామాయణ, భాగవత ఘట్టాల పెయింటింగ్‌ చిత్రాలను సైతం మందిరంలో ఏర్పాటు చేశారు.

శిలాఫలకాలు శిథిలం..

నిర్వహణ సక్రమంగా లేక ధ్యాన మందిరం ప్రస్తుతం నిరుపయోగ స్థితికి చేరింది. గతంలో రంగనాయకుల గుట్టపైనే సత్రాలు, కాటేజీలు ఉండటంతో భక్తులు సందర్శించేవారు. అనంతర కాలంలో వసతి గదులు, ప్రైవేట్‌ లాడ్జీలు గుట్ట కింది భాగంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ కాలంలో భక్త రామదాసు వాగ్గేయకారోత్సవాలను ధ్యాన మందిరంపై జరిపేవారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలను ఆలయం పక్కనే ఉన్న చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్యానమందిరానికి భక్తుల ఆదరణ తగ్గిపోతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడి కీర్తనల శిలాఫలకాలు కూడా దెబ్బతింటున్నాయి.

భక్తులను గుట్టపైకి రప్పించాలి..

ధ్యానమందిరం, రామదాసు కీర్తనల శిలాఫలాకలను పరిరక్షించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం భక్త జన మండలి సభ్యులు, అంజన్న స్వామి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. వీరికి తగిన సదుపాయాలు కల్పించి ధ్యానమందిరంతో పాటు భజన మందిరంగా అవకాశం కల్పిస్తే మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. భక్తులు రామాలయం నుంచి గుట్టపైకి వచ్చేలా ప్రచారం, రవాణా సౌకర్యం కల్పిస్తే భక్త రామదాసు పేరు, కీర్తనలు కలకాలం వినపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement