
ఆదివాసీల భూములకు నష్టం ఉండదు
ములకలపల్లి/జూలూరుపాడు: భూ భారతి చట్టంతో ఏజెన్సీలో ఆదివాసీల భూములకు ఏ మాత్రమూ నష్టం వాటిల్లదని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ స్పష్టం చేశారు. ములకలపల్లి, జూలురుపాడులలో గురువారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఏజ్సెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను గౌరవిస్తూనే స్థానిక భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కామారెడ్డి, నారాయణపేట, ఖమ్మం, ములుగు జిల్లాలో ప్రయోగాత్మకంగా భూభారతి సర్వే చేపడుతున్నట్లు వివరించారు. ధరణి పోర్టల్లోని లోపాలను సవరిస్తూ భూ భారతి చట్టం రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల భూములకు రక్షణతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులు ఆందోళనలు, అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ధరణితో నష్టపోయారు..
అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మాలోత్ రాందాస్ నాయక్లు మాట్లాడుతూ భూభారతి ద్వారా రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు దక్కుతాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు నష్టపోయారని అన్నారు. ధరణి వల్ల మ్యానువల్ పహాణీ పొందే అవకాశం కోల్పోయారని, బ్యాంకులు రుణాలు పొందలేక పోయారచని, రుణమాఫీ కూడా వర్తించలేదన్నారు. కానీ భూ భారతి చట్టంతో అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, కొత్తగూడెం ఆర్డీఓ డి.మధు, తహసీల్దార్లు గుడ్ల పుల్లారావు, కె.స్వాతిబిందు, ఎంపీడీఓలు రేవతి, డి.కరుణాకర్ రెడ్డి, ఏడీఏలు, నరసింహారావు, రవికుమార్, ఏఓలు దీపక్ ఆనంద్, అరుణ్బాబు, ఎంపీఓ తులసిరామ్, ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాళోత్ మంగీలాల్ నాయక్, తాండ్ర ప్రభాకర్రావు, నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, బానోత్ విజయాబాయి, పర్వతనేని అమర్నాఽథ్, కరుటూరి కృష్ణ, తిరుపతిరెడ్డి, ప్రసాద్, రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భూ భారతి చట్టం అవగాహన సదస్సుల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం ఐడీఓసీలో నిర్వహించిన జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా ఉండేలా కళాశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలన్నారు. పేరెంట్స్ టీచర్ సమావేశాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్లే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెలా తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శరత్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సీఐ కరంచంద్, ఎకై ్సజ్ సీఐ జానయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆర్టీఓ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నూనె గింజల సాగును ప్రోత్సహించాలి
జిల్లాలో నూనె గింజల సాగును ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం నిర్వహించిన నూనె గింజల మిషన్ జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నూనె గింజల సాగుకు వ్యయం, చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, ఆదాయం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ జితేష్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఉద్యానవన శాఖాధికారి కిషోర్బాబు, కేవీకే శాస్త్రవేత్త నారాయణమ్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.