● గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి ● ఏపీ – తెలంగాణ సరిహద్దులో ఘటన
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని కూనవరం రోడ్డులో గల గోదావరి తీరం వెంబడి ఏపీ, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం వద్ద గోదావరిలో మునిగి భద్రాచలానికి చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతి చెందిన వారిలో నలుగురు విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతుండగా, ఒకరు భద్రాచలంలో వేదాన్ని చదువుతున్నాడు.
శ్రీశైలం వెళ్తున్నట్లు చెప్పి..
విజయవాడ కళాశాల హాస్టల్ నుంచి బస్సు ద్వారా శ్రీశైలం వెళ్తున్నామని ఇళ్లల్లో చెప్పి ఓ కారుని అద్దెకు తీసుకుని, గురువారం ఉదయం భద్రాచలం బయలుదేరారు. భద్రాచలంలో వీరి స్నేహితుడు శ్రీకర్ గుప్తా సహకారంతో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని, ప్రైవేట్ రూమ్ తీసుకుని సేదతీరారు. శుక్రవారం సినిమా చూడాలనుకుని టికెట్లు బుక్ చేయగా.. అవి శనివారానికి బుక్ కావడంతో గోదావరి వద్ద ఫోటోలు దిగాలని శ్రీకర్గుప్తాను పిలిచారు. అతడు తన స్నేహితుడైన పొడిచేటి అభిరామ్ను వెంట తీసుకుని వచ్చాడు.
ఒకరి తర్వాత ఇంకొకరు
ఏడుగురు కలిసి కూనవరం రోడ్డులో కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఉన్న గోదావరి వద్దకు వెళ్లి.. దుస్తులు, మొబైల్లను అక్కడ పెట్టి నదిలోకి వెళ్లారు. ముందుగా గోక తేజజ్ఞ దిగి మునిగిపోతుండగా.. కాపాడేందుకు దిగిన శ్రీకర్ గుప్తా, నవదీప్, అభిరామ్, సతీశ్ ఒక్కసారిగా గల్లంతయ్యారు. తర్వాత హర్షా నీటిలోకి దిగి ప్రయత్నిస్తున్న క్రమంలో వెళ్లొద్దని దీపక్ వారించి, ముందుగా శ్రీకర్ గుప్తా నాన్న రామకృష్ణకు పోలీసులకు సమాచారం అందించారు. ఎటపాక, భద్రాచలానికి పలు శాఖల అధికారులు చేరుకుని గల్లంతైన వారి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. తొలుత శ్రీకర్ మృతదేహం, తర్వాత నవదీప్, అభిరామ్ మృతదేహాలు దొరి కాయి. ఆపై తేజజ్ఞ, సతీశ్ ఆచూకీ లభించకపోవడంతో గాలింపు ఆపేశారు. మృతదేహాలకు భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకర్ మృతదేహం వద్ద ఆయన తండ్రి రామకృష్ణ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ‘మీ మామయ్య వచ్చాడు లే నాన్నా..ఎప్పుడూ మామయ్య వద్దకు వెళ్తానని చెప్తావు కదా.. అంటూ విలపించడం కలచివేసింది.


