అశ్వారావుపేటరూరల్: గాలి దుమారం బీభత్సం కారణంగా విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. మండలం మండలంలోని వినాయకపురంలో గురువారం రాత్రి వీచిన గాలిదుమారానికి అశ్వారావుపేట నుంచి వినాయకపురం, నారాయణపురం, గంగారం సబ్ స్టేషన్లకు వచ్చే 33 కేవీ విద్యుత్ స్తంభాలపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో వైర్లు తెగిపోగా 45 గిరిజన గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. ఈమేరకు ట్రాన్స్కో ఈఈ నందయ్య, ఏడీఈ బి.వెంకటరత్నం, సెక్షన్ ఏఈ కె.విజయకృష్ణ, కె.వెంకటేశ్వర్లు సిబ్బందితో చేరుకుని సెల్ఫోన్లు, టార్చిలైట్ల సాయంతో మరమ్మతులు చేపట్టి రాత్రి 2 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. పనులకు ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ నరాల శ్రీనివాసరావు, సర్పంచ్లు కొవ్వాసి రాజు, అలీ, స్థానికులు సహకరించారని ఏడీఈ తెలిపారు.
పాల్వంచ మండలంలో..
పాల్వంచ/పాల్వంచరూరల్/గుండాల: పాల్వంచలో శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. మండలంలోని కిన్నెరసాని, కోడిపుంజుల వాగు, పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం, పాండురంగాపురం గ్రామాల్లోనూ వడగండ్ల వాన కురవగా మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నట్లు తెలిసింది. అలాగే, ఈదురుగాలులకు కేటీపీఎస్ యాష్ పాండ్లోని బూడిద గాలిలోకి లేచి సూరారం, పనుకుల, కొత్తసూరారంను కమ్మేసింది. ఇక ఆళ్లపల్లి మండలం రాఘవాపురానికి చెందిన కొర్సా రామ్మక్క చేనుకు వెళ్లి వస్తుండగా గాలిదుమారం రావడంతో ఓ చెట్టు కింద ఆగింది. ఒక్కసారిగా ఆ చెట్టుకొమ్మ ఆమె తలపై పడడంతో తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
విద్యుత్ లైన్పై వృక్షాలు పడడంతో అర్ధరాత్రి మరమ్మతులు


