కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం నుంచి జూన్ 6 వరకు వేసవి సెలవులు ఉంటాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా మిర్చి ఎగుమతి, దిగుమతి షాపుల కార్మిక సంఘాలు, మిర్చి యార్డు కాపలా వర్కర్స్ యూనియన్, ది గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రైతుల మిర్చి బస్తాలను గురువారం వరకే యార్డులోకి అనుమతిస్తామని తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి యార్డులో యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వివరించారు.


