కొరిటెపాడు: టెక్స్టైల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావడం అభినందనీయమని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు కాటన్ అసోసియేషన్ కార్యాలయంలో టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ నిపుణుల(ఢిల్లీ) బృందం బుధవారం భేటీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పిన్నింగ్, జిన్నింగ్, వివింగ్ పరిశ్రమలకు అండగా నిలబడాలని అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు కోరారు. ఎగుమతులను 37 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంపొందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల అవసరమని తెలిపారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సులువుగా చేరుతాయని పేర్కొన్నారు. జిన్నింగ్ పరిశ్రమ ఏపీలో ఉండగా, పంట తెలంగాణలో ఉంటుందని, తద్వారా వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు వేర్వేరుగా సెస్సు చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో క్యాండీకి రూ.600కుపైగా వ్యాపారస్తులు నష్టపోతున్నారని అన్నారు. ఏపీలో చెల్లించే చెస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెరిగిన ముడి సరుకు ధర, విద్యుత్ ఛార్జీలతో వివింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వాటిపై రాయితీచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వివింగ్ పరిశ్రమకు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిత్వ మంత్రిత్వ శాఖ 2013–14 ఇచ్చిన 20 శాతం రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి గ్రీన్ ఎనర్జీ పవర్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు స్థలాన్ని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు యాభై శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెక్స్టైల్స్ను విద్యుత్ ఆధారిత పరిశ్రమగా గుర్తించాలని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రోత్సహకాలు ప్రకటిస్తే ఎగుమతులతోపాటు యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ భేటీలో ఢిల్లీ ప్రతినిధి ధ్రువ మంగళ, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ జేడీ రాజారావు, అసోసియేషన్ సభ్యులు ఉప్పుటూరి సాంబశివ రావు, మాఘం సురేంద్రబాబు పాల్గొన్నారు.
ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్
చైర్మన్ సామినేని కోటేశ్వరరావు


