నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు.


