బాపట్లటౌన్: సాహిత్యరంగంలో డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ తెలుగు సాహితీ జగత్తులో పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక ధ్రువతారగా వెలిగారన్నారు. ‘సరస్వతీపుత్ర‘గా ఆయన తెలుగు సాహిత్యానికి విశిష్టమైన కీర్తిని చేకూర్చారన్నారు. ఆయన సాహిత్య సేవలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 28ను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. తెలుగుతో పాటు సంస్కృతం, ఫ్రెంచ్, పర్షియన్, పాలీ, అరబిక్ వంటి మొత్తం 14 భాషల్లో అఖండమైన పట్టు ఉండేదన్నారు. అనేక నవలలు, నాటకాలు, కావ్యాలు రచించి సాహిత్య శిఖరంగా నిలిచారన్నారు. ఆయన కలం నుండి జాలువారిన ‘శివతాండవం’ కావ్యం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు. శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయన్నారు. బాపట్ల డీఎస్పీ పి.జగదీష్ నాయక్ పాల్గొన్నారు.


