పెదకూరపాడు: అతివేగం ఇద్దరు మైనర్ల ప్రాణాల మీదకు తెచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకూరపాడుకు చెందిన ఇస్మాయిల్, సుభానీలు ద్విచక్ర వాహనంపై సినిమా హాల్వైపు వెళుతున్నారు.. ఈక్రమంలో వ్యక్తిగత పనులపై పెదకూరపాడు బస్టాండ్ వైపు వెళుతున్న షేక్ బాజీ వాహనం గ్రామంలోని కట్టెల అడితి వద్ద ఇరుకు బ్రిడ్జిపై ఒకరికొకరు ఢీకొనగా ఇస్మాయిల్, సుభానిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి గుంటూరు జీజీహెచ్కి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఇరువురు పరిస్థితి విషమంగా ఉంది. బాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతివేగంగా రావడంతో రెండు ద్విచక్ర వాహనాలు టైర్లు పేలి దగ్ధమయ్యాయి.
రెండు గంటల ఆలస్యం.. నెడితే గానీ కదలని వైనం..
ఇదిలా ఉండగా.. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి రెండు గంటల ఆలస్యంగా వాహనం వచ్చింది. ఈ క్రమంలో హుటాహుటిన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను వాహనంలోకి ఎక్కించారు. వాహనం ఎక్కించిన వెంటనే సెల్ఫ్ డౌన్ అయి వాహనం ఎంతసేపటికి కదలికి పోవడంతో గాయపడిన క్షతగాత్రుల బంధువులు వాహనాన్ని రెండు మూడు పర్యాయాలు నెట్టినా స్టార్ట్ కాలేదు. చివరికి ఎక్కువ మంది వచ్చి వాహనాన్ని నెట్టడంతో స్టార్ట్ అయింది. ఇది మరో రెండు గంటల పాటు జరగటంతో క్షత గాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వాహనం ఇదే రోజు మూడు పర్యాయాలు మరమ్మతులకు గురైనట్లు పైలెట్ తెలిపారు. అదిచేశాం.. ఇది చేశాం.. అంటూ గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆపద్భాందవి అయిన 108 వాహనాలకు మరమ్మతులు సైతం చేయించలేకపోతోందని స్థానికులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.


