
విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ వెంకట మురళి
నగరం: విషజర్వాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ప్రజలకు సూచించారు. మండలంలోని ఈదుపల్లి గ్రామంలో మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. ఈదుపల్లి గ్రామంలో విష జ్వరాలు ఉండటంతో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వేలో 56మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మృతి చెందిన మహలక్ష్మికి మాత్రమే డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆమె భర్త అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తేలిందన్నారు. వైరల్ ఫీవర్లు వచ్చిన వారు ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకొవడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందాలన్నారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని రోజుల తరబడి రోగులకు చికిత్స చేయకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాలక్ష్మికి డెంగీ వచ్చినట్లు గుర్తించకపోవడం వల్ల ఏఎన్ఎం, ఆశ కార్యకర్తను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో విషజ్వరాలు అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామస్తులు తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 15 రోజులలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, డీఎంహెచ్ఎం డాక్టర్ విజయమ్మ, డీఎల్డీవో పద్మ, డెప్యూటీ సీఈవో కృష్ణ, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.